ఆరున్నరేళ్లుగా పెద్దసార్లను మార్చట్లె!

ఆరున్నరేళ్లుగా పెద్దసార్లను మార్చట్లె!

రూల్స్​కు విరుద్ధంగా డిపార్ట్‌‌మెంట్‌‌ హెడ్స్‌‌ పదవీకాలం పొడిగిస్తున్న సర్కార్​

స్పెషల్​ రెజల్యూషన్​ లేకుండా సింగరేణి సీఎండీకి మరో చాన్స్​

ప్రభాకర్​రావుకు ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీగా 7సార్లు ఎక్స్​టెన్షన్​

65 ఏండ్లు నిండినా హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​ చైర్మన్​గా పాపిరెడ్డి

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ కీలక విభాగాలకు వాళ్లే అధిపతులు. అందులో రిటైర్డ్​ అధికారులూ ఉన్నారు. వారి పదవీ కాలం ముగిసినా ఎప్పటికప్పుడు వారికి సర్కార్​ ఎక్స్​టెన్షన్లు ఇస్తూనే ఉంది. బాగా పనిచేసే అధికారులు సర్వీసులో ఉన్నా.. వాళ్లను కాదని రూల్స్​కు విరుద్ధంగా పాత వారికే ప్రభుత్వం పట్టం కడుతోంది. ఇంతకాలం జరిగిన పనుల్లో అక్రమాలు, లోపాలు, అంచనాల పెంపు వంటి విషయాలు బయటకు పొక్కుతాయన్న కారణంగానే కొత్త ఆఫీసర్లను నియమించట్లేదన్న టాక్​ అధికార వర్గాల్లో నడుస్తోంది. ఎప్పుడో ఒకప్పుడు తప్పులు బయట పడతాయని, అప్పుడు ఆ ఆఫీసర్లే బలిపశువులు అవుతారని మాట్లాడుకుంటున్నారు. కీలకమైన సింగరేణి, ట్రాన్స్​ కో, జెన్​ కో, ఇరిగేషన్​, ఆర్​ అండ్​ బీ, హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​లకు చీఫ్​లను రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా మార్చింది లేదు.

ప్రభాకర్​రావుకు ఎక్స్​టెన్షన్ల మీద ఎక్స్​టెన్షన్లు
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్​ సంస్థలైన ట్రాన్స్​కో, జెన్​కోలకు సీఎండీలుగా ఐఏఎస్​ ఆఫీసర్లనే నియమించేవారు. రాష్ట్రం వచ్చాక రిటైరైన ఐఏఎస్​ అధికారి ప్రభాకర్​ రావును సీఎండీగా నియమించారు. పైగా పదవీకాలం ముగిసినా పొడిగించారు. టీఎస్​ఎస్​పీడీసీఎల్​లో చీఫ్​ ఇంజనీర్​గా పని చేసిన రఘుమారెడ్డిని, టీఎస్​ఎన్​పీడీసీఎల్​లో సూపరింటెండ్​ ఇంజనీర్​గా పని చేసిన గోపాల్​రావును సీఎండీగా కొనసాగిస్తున్నారు. వాళ్లంతా రిటైర్డ్​ అధికారులే. ఐఏఎస్​లైతే రూల్స్​కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోరన్న ఉద్దేశంతోనే.. వాళ్లను పక్కనపెట్టి చెప్పిన మాట వినేటోళ్లకే సీఎండీ బాధ్యతలు అప్పగించారన్న విమర్శలున్నాయి. రాష్ట్రం వచ్చిన కొత్తలో కరెంట్​ కొనుగోళ్లలో వేల కోట్ల అక్రమాలు జరిగాయని, యాదాద్రి, భదాద్రి పవర్​ ప్రాజెక్టుల నిర్మాణ అంచనాలను ఇష్టమొచ్చినట్టు పెంచారని ఆరోపణలున్నాయి. డిస్కంలకు అవసరం లేని పరికరాలు కొని వేల కోట్లు ఖర్చు చేశారన్న విమర్శలు వచ్చాయి.

బుజ్జగించేందుకే అడ్వైజర్​ పోస్టులు!

ప్రభుత్వంలో ఒకప్పుడు కీలక పోస్టుల్లో పనిచేసి రిటైర్​ అయిన ఆఫీసర్లను సర్కార్​ సలహాదారులుగా నియమించింది. వాళ్లు సర్వీసులో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులు, లోపాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే వారికి పదవులు ఇచ్చిననట్టు ప్రచారం ఉంది. రాష్ట్రానికి తొలి సీఎస్​గా పనిచేసి రిటైర్​ అయిన రాజీవ్​ శర్మను చీఫ్​ అడ్వైజర్​గా సర్కార్​ నియమించింది. ఆయన పదవీ కాలాన్ని 2024 డిసెంబర్​ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే డీజీపీగా రిటైర్​ అయిన అనురాగ్​ శర్మను లా అండ్​ ఆర్డర్​ అడ్వైజర్​గా, రిటైర్డ్​ సీఎస్​ ఎస్కే జోషిని ఇరిగేషన్​ సలహాదారుగా, రిటైర్డ్​ అడిషనల్​ డీజీ ఏకే ఖాన్​ను మైనారిటీ వెల్ఫేర్​ అడ్వైజర్​గా సర్కార్​ నియమించింది.

కేంద్రం వద్దన్నా సింగరేణి సీఎండీ కొనసాగింపు

సింగరేణి సీఎండీగా ఐదేళ్లకు మించి ఉండరాదని రూల్స్​ చెబుతున్నాయి. కానీ, రాష్ట్రం వచ్చినప్పటి నుంచి సంస్థ సీఎండీగా ఎన్​. శ్రీధర్​ కొనసాగుతున్నారు. ఎప్పుడో ఆయన పదవీ కాలం ముగిసినా.. ప్రభుత్వం మూడు సార్లు పొడిగించింది. తాజాగా ఈ మధ్య ఆయన పదవీ కాలాన్ని పొడిగించడంపై వివాదం నెలకొంది. బోర్డు మీటింగ్​లో ఆయన ఎక్స్​టెన్షన్​ను సెంట్రల్​ కోల్​ మినిస్ట్రీ ప్రతినిధి వ్యతిరేకించారు. అయినా పట్టించుకోని రాష్ట్ర సర్కార్​.. ఆర్డినరీ తీర్మానాన్ని ప్రవేశపెట్టి శ్రీధర్​ను ఎక్స్​టెండ్​ చేసింది. నిజానికి సీఎండీ పదవీ కాలాన్ని ఎక్స్​టెండ్​ చేయాలంటే ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మానం నెగ్గాలంటే అనుకూలంగా 70 శాతం ఓట్లు పడాలి. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం కావడం.. అప్పటికే శ్రీధర్​ కొనసాగింపును కోల్​ మినిస్ట్రీ ప్రతినిధి వ్యతిరేకించడంతో స్పెషల్​ రెజల్యూషన్​ పెట్టుంటే వీగిపోయేదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆర్డినరీ రెజల్యూషన్​ను స్పెషల్​ రెజల్యూషన్​గా మార్చాలన్నా 14 రోజుల ముందే కోల్​ మినిస్ట్రీ నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. సీఎండీ పదవిని ఎక్స్​టెండ్​ చేయాలంటే ట్రైపార్టెడ్​ అగ్రిమెంట్​ ప్రకారం కోల్​మినిస్ట్రీ అనుమతి కూడా తప్పనిసరి అని చెబుతున్నారు. అయితే, అవేవీ పట్టించుకోకుండా శ్రీధర్​ను కొనసాగించడాన్ని నిపుణులు, కార్మిక సంఘాల నేతలు తప్పుపడుతున్నారు.

మురళీధర్​కు అందుకేనా..?

రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచే నీటిపారుదల శాఖ (ఇరిగేషన్​) ఈఎన్సీగా మురళీధర్​ పనిచేస్తున్నా రు. రాష్ట్రం వచ్చాకా ఆయన్నే కొనసా గించారు. అప్పటి నుంచి ఇప్పటిదా కా ఆయన పదవీ కాలాన్ని 7 సార్లు పొడిగించారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇరిగేషన్​ పనుల్లో వేలాది కోట్ల అక్రమాలు జరిగాయని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాళేశ్వరం, పాల మూరు రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, ఇతర ప్రాజెక్టుల అంచనా ఖర్చులను పెంచి ప్రజాధనాన్ని లూటీ చేశారని విమర్శిస్తున్నాయి. అయితే ప్రాజెక్టుల అంచనాల పెంపులో ఇరిగేషన్​లోని ఉన్నతాధికారుల పాత్ర కీలకమని, అందుకే వారికి ఎక్స్​టెన్షన్లు ఇస్తున్నారని ఆరోపణ లు వస్తున్నాయి. జీవితకాలం పాటు ఇరిగేషన్​ ఈఎన్సీగా మురళీధరే కొనసాగుతారని డిపార్ట్​మెంట్​లో సెటైర్లు వినిపిస్తున్నాయి.

ఆర్​ అండ్​ బీలో రిటైర్డ్​ అధికారులే

ఆర్​ అండ్​ బీలోనూ రిటైర్డ్​ అధికారులే ఈఎన్సీలుగా పనిచేస్తున్నారు. వాళ్ల పదవీ కాలాన్నీ సర్కార్​ పొడిగిస్తూ వస్తోంది. బిల్డింగ్​ వర్క్స్​ బాధ్యతలు చూస్తున్న గణపతి రెడ్డి, రోడ్ల పనులు చూసే రవీందర్​రావు ప్రగతిభవన్​కు అత్యంత సన్నిహితులుగా మారారన్న ఆరోపణలున్నాయి. ప్రగతిభవన్​ నిర్మాణం కోసం రూ.30 కోట్లకే అనుమతులున్నా.. ఇప్పటిదాకా దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే విధంగా కలెక్టరేట్లు, పోలీస్​ టవర్​ నిర్మాణం అంచనా ఖర్చులు రెండుమూడింతలు పెంచుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం టెండర్లు కోట్​ చేసిన రేట్లు.. పని పూర్తయ్యే సరికి రెండుమూడు రెట్లు పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

మిషన్​ భగీరథదీ అదే పరిస్థితి

ప్రభుత్వం చేపట్టిన మిషన్​ భగీరథపైనా అనేక విమర్శలు, ఆరోపణలున్నాయి. వేలాది కోట్ల అక్రమాలు జరిగాయని, సబ్​కాంట్రా క్టులను టీఆర్​ఎస్​ నేతలే తీసుకున్నా రని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పనులు దక్కించుకున్న వర్క్​ ఏజెన్సీ లూ సరిగ్గా పనులు చేయలేదన్న ఫిర్యాదులున్నాయి. గతంలో భగీరథ ఈఎన్సీగా ఉన్న ఓ అధికారి.. భగీర థ పనుల్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. దీంతో ఆయన పదవీ కాలం ముగియగానే కృపాకర్​రెడ్డికి బాధ్యతలు అప్పగించింది సర్కార్​.   చెప్పినట్టు వింటారని ఆయనకు ఎక్స్​టెన్షన్​ ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎడ్యుకేషన్​ కౌన్సిల్​కు రెండు సార్లే చాన్స్, అయినా..

ఉన్నత విద్యా మండలి చైర్మన్​ పదవీ కాలాన్ని కేవలం రెండు సార్లే పొడిగించాలని, అది కూడా 65 ఏండ్ల లోపు వ్యక్తులనే నియమించాలని ఉన్నత విద్యామండలి యాక్ట్​ 16 ఆఫ్​1988 రూల్స్​ చెబుతున్నాయి. కానీ, 2019 జూన్​ 30 నాటికే పాపిరెడ్డికి 65 ఏండ్లు నిండాయి. కరోనా సాకుతో 2020 జులై 17న ఆయనకు సర్కార్​ ఎక్స్​టెన్షన్​ ఇచ్చింది. ఆయన నియామకం చట్టవిరుద్ధమని, పాపిరెడ్డిని తొలగించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని సీఎస్​కు ఫిర్యాదులూ వెళ్లాయి. అయితే, కాలేజీల ఏర్పాటు, కొత్త కోర్సులకు అనుమతి, సీట్ల పెంపు వంటి విషయాల్లో డబ్బు ముట్టజెప్పందే కౌన్సిల్​లో పనులు కావని ఓపెన్​గానే మాట్లాడుకుంటున్నారు.

 

ఇవి కూడా చదవండి..

ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వండి

రైతులు పంటలను మార్కెట్​లోనే అమ్ముకోవాలె

ప్రాణహిత ప్రవాహం తగ్గింది.. యాసంగికి నీళ్లెట్ల..?

పీహెచ్‌‌‌‌సీ నుంచే పెద్ద డాక్టర్‌‌‌‌కు చూపెట్టుకోవచ్చు