
- జీతాలు రాక నాన్ టీచింగ్ స్టాఫ్ ఆందోళనతో ఫుడ్ బంద్
- బయటి నుంచి తెప్పిస్తున్న చీఫ్ వార్డెన్
డిచ్పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. జీతాలు లేక నాన్టీచింగ్స్టాఫ్ఆందోళనకు దిగడంతో తినడానికి తిండి లేక విద్యార్థులు అడుక్కోవలసి వస్తున్నది. హాస్టల్లో భోజనం వండకపోవడంతో విద్యార్థులు సమీప గ్రామంలోకి వెళ్లి భిక్షాటన చేసి ఆకలి తీర్చుకుంటున్నారు. వీసీ రవీందర్గుప్తా, ఈసీకి మధ్య పడకపోవడంతో వర్సిటీలో పాలన గాడి తప్పింది.
చెరో రిజిస్ట్రార్ను నియమించడం, ఈసీ తీర్మానాలపై వీసీ హైకోర్టు కు వెళ్లడంతో వర్సిటీకి సంబంధించిన ఆర్థిక లావాదేవిలన్నీ నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. దీంతో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 12వ తేదీ నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. హాస్టల్లో మెస్ వర్కర్లు కూడా డ్యూటీకు రాకపోవడంతో స్టూడెంట్స్ ఆకలితో అలమటిస్తున్నారు.
సమయానికి అందని భోజనం
మెస్వర్కర్లు వంటచేయకపోవడంతో చీఫ్వార్డెన్క్యాటరింగ్ నుంచి టిఫిన్లు, భోజనాలు తెప్పిస్తున్నారు. అవి కూడా సమయానికి అందడం లేదు. దీంతో స్టూడెంట్స్గురువారం వర్సిటీ మెయిన్గేట్దగ్గర ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా భోజనం రాకపోవడంతో సుమారు 30 మంది విద్యార్థులు పక్కనే ఉన్న నడిపల్లి తండాకు వెళ్లి అడుక్కుని తిన్నారు. ఇది తెలుసుకున్న అధికారులు క్యాటరింగ్నుంచి సాయంత్రం 5.30 గంటలకు భోజనం తెప్పించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.