టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ : ఎంపీ అర్వింద్

టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ : ఎంపీ అర్వింద్

మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన నలుగురు ఎమ్మెల్యేల కథ ఒక కామెడీ సీన్ అని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ వ్యవహారం సీరియస్ సినిమా మధ్య వచ్చే కామెడీ బిట్  లెక్క ఉందని సటైర్ వేశారు. ఆ ఘటన చూసి కాసేపు నవ్వుకున్నామని చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు సెకండ్ హ్యాండ్ అని, అలాంటి వారికి అంత రేటు పలకదని అన్నారు. ముందు నుంచీ తాను అదే విషయం చెప్తున్నానని, నిజానికి టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ అని వ్యాఖ్యానించారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరిది కూడా గెలిచే ముఖం కాదన్న అర్వింద్..  కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎన్నడూ కండువా కప్పదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరాలనుకునే సిట్టింగ్ లు పదవికి రాజీనామా చేసి తనకుగానీ, బండి సంజయ్ కు గానీ అప్లికేషన్ పెట్టుకుంటే సర్వే చేసి టికెట్ ఇస్తామని తేల్చిచెప్పారు. 

పనికిమాలిన కామెడీ షోలు.. 

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో కేసీఆర్ 4లక్షల కోట్లకుపైగా అప్పుచేసి ఒక్కో కుటుంబంపై రూ.4 లక్షల అప్పు పెట్టిండని అర్వింద్ ఆరోపించారు. అన్ని కోట్ల అప్పు చేసినా ప్రజల బతుకులు మారలేదని విమర్శించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలని అర్వింద్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరాకూ అదనంగా నీళ్లు అందలేదన్న ఆయన..  రైతుకు రుణమాఫీ కూడా చేయలేదని చెప్పారు. లక్ష రుణమాఫీ చేస్తమని గొప్పలు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు పనికిమాలిన కామెడీ షోలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు పేరుతో అన్నీ బంద్ చేసిన టీఆర్ఎస్ సర్కారు ఉచిత ఎరువులు, పంటలకు ఎంఎస్పీ కల్పిస్తామన్న హామీలను నెరవేర్చలేదని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని సైతం రాష్ట్రంలో అమలు చేస్తలేరని అర్వింద్ ఆరోపించారు.

ఇక్కడ బీర్లు, బిర్యానీలు.. అక్కడ పురుగుల భోజనం

వ్యవసాయం, మౌళిక పరిశ్రమల అభివృద్ధికి లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నా కేసీఆర్ రైతుల  కోసం కేంద్రాన్ని నిధులు ఎందుకు అడగడం లేదని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇయ్యలేదని విమర్శించారు. ఉప ఎన్నిక రావడంతో మునుగోడుకు అదిస్తాం, ఇదిస్తామంటున్న కేసీఆర్ ఇన్ని రోజులు ఎందుకివ్వలేదని నిలదీశారు. మునుగోడులో బీర్లు, బిర్యానీలు పంపిణీ చేస్తూ, స్కూళ్లు, కాలేజీల్లో పురుగుల భోజనం పెడుతున్నారని ఆరోపించారు. వర్సిటీల్లో అవసరమైన  సౌకర్యాలులేవన్న ఆయన.. ఒక్క వర్సిటీకి పర్మినెంట్ వీసీ లేరని విమర్శించారు.

మునుగోడును నిండా ముంచిండు

ఉప ఎన్నిక ముగిసిన తర్వాత మునుగోడుకు ఏమేం చేస్తామని హామీ ఇచ్చిండో అవన్నీ కేసీఆర్ కు గుర్తు చేస్తమని ఎంపీ అర్వింద్ చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తమని చెప్పి దాదాపు 52వేల మందిని తీసేసిన ఘనత కేసీఆర్ కే చెల్లిందని మండిపడ్డారు. ఇప్పటి వరకు టీచర్ల నియామకాల్లేకపోగా.. వలసలు పదింతలు పెరిగాయని, రూ.500కోట్ల పెట్టి ఎన్నారై సెల్ ఏర్పాటు చేస్తమని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రజలు అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి బిడ్డ మాత్రం రూ.500కోట్ల ఇల్లు కట్టుకుందని అర్వింద్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టులు దగాపడ్డారని, వారి కోసం ఇండ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి ప్రభుత్వం కాలాయాపన చేస్తోందని చెప్పారు. మునుగోడును నిండా ముంచిన కేసీఆర్ ప్రభుత్వం.. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.