- గల్ఫ్లోని వలస కూలీల ఆవేదన
- తినేందుక తిండి లేదంటున్న కూలీలు
ఖతార్: చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కంటికి కనిపించని కరోనా వైరస్ వలస కూలీల కడుపుకొడుతోంది. బతుకు దెరువు కోసం దేశం కాని దేశానికి వెళ్లిన వారిని కష్టాల పాలు చేస్తోంది. గల్ఫ్ కంట్రీస్లోని చాలా మంది స్థితి దయనీయంగా తయారైంది. మన దేశానికి చెందిన వారే కాకుండా ఏషియా, ఆఫిక్రా ఖండాల్లోని వివిధ దేశాల నుంచి పనుల కోసం గల్ఫ్ వెళ్లిన వారికి ఇప్పుడు పని లేక, జీతాలు రాక పస్తులు పడుకుంటున్నారు. తమ దగ్గర ఉన్న తిండి, డబ్బులు అయిపోవడంతో ఆకలికి అలమటించిపోతున్నారు. ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, కనీసం తిండి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “ మా గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కరోనా వల్ల కాదు.. ఆకలితో చనిపోతానేమో” అని రెస్టారెంట్లో పనిచేసే ఈజిప్టియన్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ ప్రకారం సౌదీ అరేబియాలో దాదాపు 34 మిలియన్ల మంది ఫారెనర్స్ ఉన్నారు. అంటే బెహ్రయిన్, ఒమన్లోని సగం మంది జనాభా. కువైట్లో, ఖతార్లో, యునైటెడ్ అరబ్ ఎమరైట్స్లో కూడా వలస వచ్చిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కాగా కరోనా కారణంగా ఆయా దేశాల్లో లాక్డౌన్ విధించడంతో వాళ్లంతా పనులు లేక రోడ్డున పడ్డారు. అది కేవలం వారికే కాకుండా సొంత దేశంపై పడనుంది. ఏటా రెమిటాన్సెస్ ద్వారా బిలియన్ డాలర్లు వచ్చే ఆదాయం తగ్గిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సౌదీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కవు శాతం ఫారెనర్స్కే అని సౌదీ అరేబియా హెల్త్ మినిస్టర్ చెప్పారు. అంతే కాకుండా 2020 వరల్డ్ కప్ స్టేడియం నిర్మాణానికి వచ్చిన కూలీల్లో చాలా మందికి వైరస్ ఉన్నందున ఆ ఏరియాను ఐసోలేట్ చేసి, పూర్తిగా లాక్డౌన్ చేశామని అధికారులు చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారందరికీ, విదేశీయులతో సహా ప్రభుత్వం తరఫున ట్రీట్మెంట్ ఇస్తామని సౌదీ అరేబియా రాజు సల్మాన్ పోయిన నెలలో ప్రకటించారు. అయితే ప్రైవేటు రంగ కార్మికులకు పాక్షికంగా జీతాలు చెల్లించేందుకు రిలీజ్ చేసిన 2.4 బిలియన్ డాలర్ల ప్యాకేజ్ మాత్రం కేవలం లోకల్స్కు మాత్రమే వర్తిస్తుందని ప్రకటించారు. దీంతో ఇతర దేశాల నుంచి వలస వచ్చిన ఎవరికి ఉపాధి లేదు. అంతే కాకుండా ఒక్క రూమ్లో 10 మందికిపైగానే కలిసి ఉంటున్నారు. ఒకరికి వ్యాధి సోకితే మిగతా వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడతారని హ్యూమన్ రైట్స్ రిసెర్చర్ హిబా జయాదిన్ అభిప్రాయపడ్డారు. “ మేం రోజు పనికి వెళ్లేటప్పుడు ఒక్కో బస్సులో 60 మంది ప్రయానం చేస్తాం. ఆరు బాత్రూంలను 450 మంది వాడాలి. తిండి కూడా ఒకే డైనింగ్ హాల్లో గుంపుగా కూర్చొని తినాలి. స్టాఫ్ను తగ్గించమంటే మా ఓనర్లు ఒప్పుకోవడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో బతుకుతున్నాం. సోషల్ డిస్టెంసింగ్ పాటించలేక పోతున్నాం” అని ఖత్తార్లో పనిచేసే కెన్యాకు చెందిన ఒక వ్యక్తి చెప్పారు. “ మేం బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయిండి. పోలీసులు చాలా కఠినంగా ఉన్నారు. మా దగ్గర ఉన్న రైస్ కూడా అయిపోయింది. తినేందుకు ఏమీ లేక ఇబ్బంది పడుతున్నాం” అని పాకిస్తాన్కు చెందిన ఒక వలస కూలీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్, కువైట్ తదితర దేశాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున పూర్తి లాక్డౌన్ విధించారు. దీంతో చాలా కంపెనీలు మూతపడ్డాయి.