ట్రిపుల్​ ఆర్​ రైతులకు నోటీసులు.. తుర్కపల్లి ‘కాలా’ పరిధిలో స్టార్ట్​

ట్రిపుల్​ ఆర్​ రైతులకు నోటీసులు..  తుర్కపల్లి ‘కాలా’ పరిధిలో స్టార్ట్​
  • స్ట్రక్చర్స్​​లేని భూముల రైతులకే నోటీసులు
  • వివరాలు నమోదయ్యాక పరిహారం జమ

యాదాద్రి, వెలుగు: ట్రిపుల్​ ఆర్​ ఉత్తర భాగం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నోటీసులు జారీ అయ్యాయి. భూములకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసిన వారికి త్వరలోనే పరిహారం అందనుంది. సంగారెడ్డి, మెదక్​, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో ట్రిపుల్​ ఆర్​ ఉత్తర భాగం నిర్మాణం కానుంది. 164 కిలోమీటర్ల రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించడానికి ఆయా జిల్లాల్లో 8 ‘కాలా’(కాంపిటెంట్ అథారిటీ ల్యాండ్ అక్విజిషన్)ను ఏర్పాటు చేసి అడిషనల్​ కలెక్టర్, ఆర్డీవోలను బాధ్యులుగా నియమించారు. 

యాదాద్రి జిల్లాలో 59.33 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉండగా, 1,795 ఎకరాలకు త్రీజీ నోటిఫికేషన్​ జారీ చేశారు. తుర్కపల్లి ‘కాలా’ పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సేకరించే భూముల్లోని బోర్లు, బావులు, చెట్లు, కట్టడాలకు సంబంధించిన స్ట్రక్చర్​ ఎంక్వైరీ ముగిసింది. భువనగిరి, చౌటుప్పల్​ పరిధిలోని భూములకు సంబంధించిన రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. స్ట్రక్చర్​ ఎంక్వైరీ కూడా చేయనీయలేదు.  

తుర్కపల్లి పరిధిలోని రైతులకు నోటీసులు..

తుర్కపల్లి పరిధిలో సేకరించే 510 ఎకరాల్లో స్టక్చర్​ ఎంక్వైరీతో పాటు వెరిఫికేషన్​ కూడా ముగిసింది. ఇందులో ఇబ్రహీంపూర్, కోనాపూర్, దాతరుపల్లి, దత్తాయిపల్లి, మల్లాపూర్​ తదితర గ్రామాల్లోని రైతులకు సంబంధించి 8 ఎకరాలు, ప్రభుత్వ పరిధిలోని 6 ఎకరాల్లో ఎలాంటి స్ట్రక్చర్లు లేవు, దీంతో ముందుగా ఎలాంటి స్ట్రక్చర్స్  లేని భూముల రైతులకు పరిహారం ఇవ్వాలని హైవే అధికారులు నిర్ణయించారు. దీంతో 8 ఎకరాలు కోల్పోతున్న 32 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. 

ఈ నోటీసుల్లో రైతు కోల్పోతున్న భూ విస్తీర్ణం, చెల్లించే విలువను పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న రైతులకు నోటీసులు అందజేయగా, మిగలిన వారికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. నోటీసులు అందుకున్న రైతులు ఈసీ, పట్టాదారు పాస్​బుక్స్, బ్యాంక్​ పాస్​బుక్, ఆధార్, పాన్​కార్డుతో పాటు మూడు ఫొటోలను ఈ నెలాఖరులోగా అందించాలి. అయితే గతంలో పాన్​కార్డు తీసుకోలేదు. గతేడాది జనవరి నుంచి పాన్​కార్డు తప్పనిసరి చేశారు. దీంతో పాన్ కార్డులు లేని రైతులు అప్లయ్​ చేసుకుంటున్నారు. రైతుల నుంచి డ్యాక్యుమెంట్లు తీసుకున్న తరువాత​ఆ వివరాలను జిల్లా ఆఫీసర్లు భూమి రాశి పోర్టల్​లో అప్​లోడ్​ చేయనున్నారు. ఆ తర్వాతే రైతుల అకౌంట్లలో పరిహారం జమ కానుంది.