
ప్లాటు అమ్మిన వ్యవహారంలో సినీనటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసుల నోటీసులు జారీ చేశారు. లేని ప్లాటు ఉన్నట్లు చూపించి అమ్మారనే ఆరోపణలతో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్నగర్లో కేసు నమోదయ్యింది. ఈ కేసులో కనకాలకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు గురువారం (జులై 24) నోటీసులు ఇచ్చారు.
హయత్నగర్ పోలీస్స్టేషన్పరిధిలోని పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 421లోని వెంచర్లో రాజీవ్ కనకాలకు ఓ వివాదాస్పద ప్లాటు ఉండేది. ప్లాట్ నంబర్–69 గల ప్లాట్ ను సినీ నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. విజయ్చౌదరి సదరు ప్లాటును ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన శ్రవణ్రెడ్డి అనే వ్యక్తికి రూ. 70 లక్షలకు విక్రయించారు.
ఏడాది కిందట శ్రవణ్రెడ్డి తన ప్లాటు పొజిషన్ కు వెళ్లగా.. సదరు నంబర్ ప్లాటు లేకుండా మొత్తం ఆనవాళ్లు చెరిపేశారు. విజయ్చౌదరిని సంప్రదించగా.. ప్లాట్ ఇవ్వబోనని దానిపై వివాదం నడుస్తోందని, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అంటూ దాటవేత సమాధానం చెప్పారు. ఏడాది కాలంగా.. ఎన్నిసార్లు సంప్రదించినా.. ప్లాటును చూపకపోగా.. సదరు ప్లాటు ఉన్నదని ఒకసారి.. అసలు లేదని మరోసారి చెబుతూ వస్తున్నారు. ఒక్కోసారి ప్లాటు మీకు ఇవ్వను బెదిరిస్తూ ఇలా కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఇంటికి వెళ్లి నిలదీస్తే.. మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితుడు శ్రవణ్రెడ్డి హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లేని ప్లాటును ఉన్నట్లు చూపి మోసం చేశారని బాధితుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విజయ్ చౌదరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ప్లాటు విక్రయదారు, వెంచర్ భాగస్వామి , దివంగత సినీనటుడు దేవదాస్ కనకాల కుమారుడైన సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ చేశారు.