
హైదరాబాద్: వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీ కి ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరగనుంది. జులై 2వ తేదీ నుంచి జులై 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. డీపీహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ డీఎంఈ విభాగంలో 431 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మల్టీ జోన్ -1లో 270, మల్టీజోన్-2లో 161 పోస్టులు ఉన్నాయి. ఐపీఎం విభాగంలో 4 పోస్టులు ఉండగా, మల్టీజోన్-1లో 1, మల్టీజోన్-2లో 3 పోస్టులు ఉన్నాయి.
విద్యపైనా దృష్టి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తం 279966 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలను కూడా రన్ చేయనున్నట్టు సీఎం రేవంత్ గతంలోనే ప్రకటించారు. విద్యారంగంలో సమూలమార్పలు తెచ్చేందుకు విద్యాకమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యపై ప్రధానంగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే.