కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్లు స్పీకర్ కార్యాలయం ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఆయన మళ్లీ ఎంపీగా పార్లమెంటు మెట్లు ఎక్కనున్నారు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభం అనంతరం తొలి సారి రాహుల్ సభలో అడుగుపెట్టనున్నారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్ష అమలుపై ఇటీవల సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో రాహుల్కు గరిష్ట శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎలాంటి కారణాలు చెప్పలేదని వ్యాఖ్యానించింది. దీంతో రాహుల్ను దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
జరిగిందిదే..
‘మోదీ ఇంటి పేరు’పై చేసిన వ్యాఖ్యలకు 2019లో రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన గుజరాత్లోని సూరత్ కోర్టు.. రెండేండ్ల జైలుశిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు చెప్పింది. దీన్ని హైకోర్టులో రాహుల్ అప్పీల్ చేయగా చుక్కెదురైంది. చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును రాహుల్ ఆశ్రయించారు. వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన బెంచ్.. కీలక ఉత్తర్వులు వెలువరించింది. రాహుల్కు విధించిన రెండేళ్ల జైలుశిక్షపై స్టే ఇచ్చింది.
‘‘ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 499 (పరువు నష్టం) కింద శిక్షార్హమైన నేరానికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. కానీ ట్రయల్ జడ్జి రెండేండ్ల గరిష్ఠ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. గతంలో ధిక్కార కేసులో రాహుల్ను సుప్రీంకోర్టు హెచ్చరించిన విషయాన్ని తప్ప.. ఇంకే కారణాన్ని కూడా జడ్జి చూపలేకపోయారు. ట్రయల్ జడ్జి విధించిన ఈ గరిష్ఠ శిక్ష కారణంగానే.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలు అమలులోకి వచ్చాయి. శిక్ష ఒక్క రోజు తక్కువగా ఉన్నా.. నిబంధనలు వర్తించేవి కావు. ట్రయల్ కోర్టు జడ్జి ఈ గరిష్ఠ శిక్ష విధించడానికి కొన్ని కారణాలను సూచించాల్సింది. శిక్షపై స్టేను తిరస్కరించేందుకు అప్పిలేట్ కోర్టు, హైకోర్టు భారీగా పేజీలను ఖర్చు చేశాయి. కానీ పైన మేం పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు’’ అని చెప్పింది.
నియోజకవర్గ ప్రజలపైనా ప్రభావం
‘‘రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం, అనర్హత వేటు వేయడం వల్ల.. ప్రజా జీవితంలో కొనసాగే ఆయన హక్కుపై ప్రభావం పడింది. అంతే కాదు.. తమ నియోజకవర్గానికి (వయనాడ్) ప్రాతినిధ్యం వహించడానికి ఆయనను ఎన్నుకున్న ఓటర్లను కూడా ప్రభావితం చేసింది’’ అని సుప్రీం కోర్టు చెప్పింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవనడంలో ఎలాంటి సందేహమూ లేదని, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, గరిష్ట శిక్షను విధించడానికి ట్రయల్ జడ్జి ఎలాంటి కారణం చూపలేదన్న విషయాన్ని గుర్తించి.. తుది తీర్పు వెలువడే వరకు శిక్ష అమలుపై స్టే విధించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ తరఫున అభిషేక్ సింఘ్వీ, ఫిర్యాదుదారు పూర్ణేశ్ మోదీ తరఫున మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు.
ఎప్పుడు ఏం జరిగిందంటే..
2019 ఏప్రిల్ 13: కర్నాటకలోని కోలార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలందరికీ ‘మోదీ’ అనే కామన్ ఇంటి పేరు ఎందుకు ఉంది?” అని ప్రశ్నించారు.
2019 ఏప్రిల్ 15: సూరత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. రాహుల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు వేశారు.
2019 జులై 7: సూరత్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట రాహుల్ తొలిసారి హాజరయ్యారు.
2023 మార్చి 23: పరువునష్టం కేసులో రాహుల్ తప్పు చేసినట్లు నిర్ధారిస్తూ.. ఆయనకు రెండేండ్ల జైలుశిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది.
2023 మార్చి 24: రెండేండ్ల జైలుశిక్ష పడినందుకు రాహుల్ ఎంపీగా అనర్హత వేటుకు గురయ్యారు.
2023 ఏప్రిల్ 2: సూరత్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో రాహుల్ సవాలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా అక్కడ పెండింగ్లో ఉంది.
2023 ఏప్రిల్ 20: రాహుల్కు బెయిల్ ఇచ్చిన సెషన్స్ కోర్టు.. తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది.
2023 ఏప్రిల్ 25: కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టును రాహుల్ఆశ్రయించారు.
2023 జులై 7: రాహుల్ అభ్యర్థనను హైకోర్టు డిస్మిస్ చేసింది.
2023 జులై 15: గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2023 జులై 21: గుజరాత్ మంత్రి పూర్ణేశ్ మోదీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.
2023 ఆగస్టు 4: రాహుల్కు విధించిన జైలు శిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే.