- వరుసగా 9 వ నెలలోనూ
- 1.4 లక్షల కోట్లకు పైనే జీఎస్టీ
- నవంబర్లో 11 శాతం పెరిగిన వసూళ్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు నవంబర్లో 11 శాతం పెరిగి రూ.1.46 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రజల వినియోగం పెరగడంతో పాటు, ట్యాక్స్ రూల్స్ను మెరుగ్గా అమలు చేయడంతో జీఎస్టీ వసూళ్లు మరో నెలలో కూడా పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా, జీఎస్టీ కలెక్షన్స్ వరుసగా తొమ్మిదొవ నెలలో కూడా రూ. 1.4 లక్షల కోట్లకు పైన నమోదు కావడం విశేషం. కానీ, ఈ ఏడాది ఆగస్టు నుంచి చూస్తే నవంబర్లోనే జీఎస్టీ వసూళ్లు తక్కువగా జరిగాయి.
అక్టోబర్లో రూ.1.52 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. ‘నవంబర్లో వసూలైన గ్రాస్ జీఎస్టీ రూ.1,45,867 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 25,681 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.32,651 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.77,103 కోట్లు (ఇందులో వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.38,635 కోట్లు కలిసి ఉన్నాయి). సెస్ కింద రూ.10,433 కోట్లు వచ్చాయి. ఇందులో వస్తువుల దిగుమతులపై వేసిన రూ.817 కోట్లు కలిసి ఉన్నాయి’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది.
కిందటేడాది నవంబర్లో వచ్చిన జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఈసారి 11 శాతం ఎక్కువ వచ్చాయని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.1.68 లక్షల కోట్లను టచ్ చేసిన జీఎస్టీ వసూళ్లు, ఈ లెవెల్ దగ్గర ఆల్ టైమ్ హైని నమోదు చేశాయి. మే లో రూ.1.41 లక్షల కోట్లు, జూన్లో రూ.1.45 లక్షల కోట్లు, జులైలో రూ.1.49 లక్షల కోట్లు, ఆగస్టులో రూ.1.44 లక్షల కోట్లు వచ్చాయి.