- కొన్ని ప్రొడక్టులపై 60 శాతం వరకు డిస్కౌంట్
న్యూఢిల్లీ: పండుగ అమ్మకాలకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి కంపెనీలు రెడీ అయ్యాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి, భారీ అమ్మకాలను సాధించడానికి ప్రతి ఏడాది మాదిరే ఈసారీ భారీ ఆఫర్లతో, డిస్కౌంట్లతో ఊరించబోతున్నాయి. అంతేగాక ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, డెబిట్/క్రెడిట్కార్డులతో డిస్కౌంట్లు ఇవ్వబోతున్నాయి. కొన్ని విభాగాల ప్రొడక్టులపై 60శాతం వరకు తగ్గింపు ఇస్తామని అనేక ఈ–కామర్స్ కంపెనీలు ఇది వరకే ప్రకటించాయి. మరికొన్ని కంపెనీలు పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రొడక్టులను లాంచ్ చేస్తున్నట్టు తెలిపాయి. వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇండియా, రిలయన్స్ రిటైల్ జియోమార్ట్ అజియో, టాటా న్యూ తదితర కంపెనీలు స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) ప్రొడక్టులపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తాయని అంచనా. ఈ విషయమై ఆన్లైన్ షాపింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్లు మాట్లాడుతూ, ఈ సంవత్సరం తగ్గింపులు ఇవ్వడంతోపాటు ఆన్లైన్ ప్రమోషన్ల కోసం గత సంవత్సరం కంటే 10–-20శాతం అధిక బడ్జెట్ను కేటాయించామని వెల్లడించారు. ఇన్పుట్ ఖర్చులను తగ్గించడం ద్వారా ప్రచారానికి బడ్జెట్ను పెంచామని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో సగటు తగ్గింపులు 20-–30శాతం వరకు, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50–-60శాతం, సాధారణ వస్తువులపై 30–-40శాతం డిస్కౌంట్లు ఉండొచ్చన్నది అంచనా.
మిడ్ - టు -ప్రీమియం ప్రొడక్టులపై ఫోకస్
ఈ–కామర్స్ మార్కెట్ప్లేస్లు, ప్లాట్ఫారమ్లు పండుగ సీజన్ను సొమ్ము చేసుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్నీ వదలడం లేదు. ఇవి ఈ వారం నుంచే ప్రీ-ఫెస్టివ్ సేల్స్ను మొదలుపెట్టాయి. మిగతా కంపెనీలు వీటిని అక్టోబర్ 8-–10 మధ్య ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై సమాచారం కోరుతూ అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్, టాటా న్యూలకు పంపిన ఈ– మెయిల్స్కు ప్రెస్ సమయం వరకు సమాధానం లేదు. కంపెనీలు తమ పండుగల సీజన్ అమ్మకాల వృద్ధిని గత ఏడాది కంటే మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నందున, మిడ్ నుంచి ప్రీమియం మోడల్లకు ఎక్కువ తగ్గింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు, స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీ, ఈ సీజన్లో వినియోగదారులకు ఆఫర్లు ఇవ్వడం కోసం రూ.800 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఇదే కంపెనీ గత ఏడాది రూ.700 కోట్లు ఖర్చు పెట్టింది. మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ రీసెర్చర్ కౌంటర్ పాయింట్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం.. స్మార్ట్ఫోన్ బ్రాండ్లు ఈ ఏడాది 10-–15శాతం వరకు తగ్గింపును ఇస్తాయి. 4జీ మోడల్లపై 20–-25శాతం వరకు తగ్గింపును అందిస్తాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ ఈ విషయమై మాట్లాడుతూ "అనేక బ్రాండ్లు 13 వారాలుగా అమ్ముడుపోని 4జీ స్మార్ట్ఫోన్ స్టాక్ను వదిలించుకోవడంపై దృష్టి పెట్టాయి. సాధారణంగా అయితే స్టాక్ ఎనిమిది నుంచి తొమ్మిది వారాలలోపు అమ్ముడుపోవాలి. ఇప్పుడు స్మార్ట్ఫోన్ కంపెనీల దగ్గర 4జీ ఫోన్ల స్టాక్ ఎక్కువ ఉంది" అని ఆయన చెప్పారు. మనదేశంలో కోడాక్, థామ్సన్, బ్లూపంక్ట్ వంటి ఎలక్ట్రానిక్ బ్రాండ్ల ప్రొడక్టులను విక్రయించడానికి లైసెన్స్ ఉన్న సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ఈసారి డిస్కౌంట్లను మరో 10శాతం పెంచనుంది. ఈసారి 43–-65 అంగుళాల టెలివిజన్లపై భారీ తగ్గింపులు ఇస్తామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు.