
- ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రస్తావించిన ఎన్ఎస్ఏ దోవల్
- విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్
- భారత్కు నష్టం జరిగినట్టు ఒక్క ఫొటోనైనా చూపాలని సవాల్
చెన్నై: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించామని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ పేర్కొన్నారు. అయితే, విదేశీ మీడియా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. శుక్రవారం చైన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా దోవల్ మీడియాతో మాట్లాడారు. భారత సాయుధ బలగాల సామర్థ్యాన్ని ప్రశంసించారు. ‘‘మేం చాలా గర్వపడుతున్నాం..23 నిమిషాల్లోనే పాక్లోని 9 ఉగ్రస్థావరాలను టార్గెట్ చేశాం. ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా విడిచిపెట్టలేదు. ఆ లక్ష్యాలకు మించి వేరే ఎక్కడా దాడి చేయలేదు” అని స్పష్టం చేశారు. బ్రహ్మోస్ క్షిపణి, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ సిస్టమ్ లాంటి దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, రక్షణ వ్యవస్థల నాణ్యతను దోవల్ ప్రశంసించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్జెట్ల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ మిసైల్స్ పాక్ భూభాగాల లోపలి వరకూ వెళ్లి ఆ దేశానికి చెందిన పలు ఎయిర్బేస్లను ధ్వంసం చేశాయని వెల్లడించారు. అలాగే, భారత్పై పాక్ ప్రయోగించిన ఫతాహ్–11 బాలిస్టిక్ మిసైల్ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400 పేల్చేశాయని వివరించారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన పరికరాలను దేశీయంగా రూపొందిస్తున్నామని, భవిష్యత్తులో ఎలాంటి యుద్ధ పరిస్థితులు ఎదురైనా సమర్థంగా
ఎదుర్కొంటామని దోవల్ వివరించారు.
ఆధారాల్లేకుండా విదేశీ మీడియాల్లో కథనాలు
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం వాటిల్లిందంటూ విదేశీ మీడియా నిరాధార కథనాలు ప్రచురిస్తోందని మండిపడ్డారు. పాక్ దాడుల్లో భారత్కు నష్టం కలిగిందనే విషయాన్ని నిరూపించేందుకు ఒక్క ఆధారాన్ని అయినా చూపాలని సవాల్ చేశారు. ‘‘పాక్ అది చేసింది.. ఇది చేసింది అంటూ విదేశీ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేసింది. ఆ దేశంలోని ఉగ్రస్థావరాలపై భారత బలగాలు అత్యంత కచ్చితమైన సమాచారంతోనే దాడులు చేశాయి.
మే 10కి ముందు.. ఆ తర్వాత పాక్లోని 13 ఎయిర్ బేస్లు ధ్వంసమైన ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయి కానీ.. భారత్కు నష్టం జరిగినట్లు ఒక్క ఫొటో కూడా లేదు. భారత్కు చెందిన ఆయుధ స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదు” అని పేర్కొన్నారు.