న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అవర్స్ను పెంచాలని చూస్తోంది. సాయంత్రం సెషన్ను ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు జరిపే అవకాశం ఉంది. ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30 వరకు సాధారణ ట్రేడింగ్ ఎలాగూ ఉంటుంది. సాయంత్రం సెషన్ను రాత్రి 11.30 కు పెంచే అవకాశం కూడా ఉందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వంటి ఇండెక్స్ డెరివేటివ్లతో పాటు ఈక్విటీ డెరివేటివ్ల ట్రేడింగ్ అవర్స్ను కూడా ఎన్ఎస్ఈ పెంచనుంది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ అనుమతుల కోసం ఎన్ఎస్ఈ ఎదురు చూస్తోంది. గిఫ్ట్ సిటీలో 24 గంటల పాటు ట్రేడింగ్ ఉంటుంది. దీంతో పెద్ద ట్రేడర్లు అటు షిఫ్ట్ అవుతున్నారు.
గ్లోబల్ ఈవెంట్స్కు వేగంగా స్పందించేందుకు చిన్న ట్రేడర్లు కూడా అవకాశం కలిపించేందుకు ట్రేడింగ్ అవర్స్ను ఎన్ఎస్ఈ పెంచుతోంది. ఇదే జరిగితే ఈ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రపోజల్ను ఇప్పటికే సెబీకి ఎక్స్చేంజ్లు సబ్మిట్ చేశాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ను రాత్రి 11.55 వరకు, షేర్ల ట్రేడింగ్ను సాయంత్రం ఐదు వరకు కొనసాగించడానికి సెబీ రూల్స్ తయారు చేస్తోందని సంబంధిత వ్యక్తులు అన్నారు. ట్రేడింగ్ అవర్స్ దశల వారీగా పెంచాలని ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎన్ఎస్ఈ ప్లాన్ చేస్తోంది. ట్రేడింగ్ అవర్స్ పెంచడం వలన వాల్యూమ్స్ పెరగకపోవచ్చని, ఖర్చులు పెరుగుతాయని, ఉద్యోగులపై భారం పడుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.