అంతరం ఆకాశమంత .. సంపదలో విపరీతంగా అసమానతలు     

అంతరం ఆకాశమంత .. సంపదలో విపరీతంగా అసమానతలు     
  • మరింత పెరిగిన ధనవంతుల సంపద 
  • కింది స్థాయి ఉద్యోగుల శాలరీల్లో లేని గ్రోత్‌‌
  • వెల్లడించిన వరల్డ్‌‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌‌ రిపోర్ట్

న్యూఢిల్లీ: పదేళ్ల కిందట నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరం మరింత పెరిగింది. ధనవంతులు  మరింత ధనవంతులయ్యారు. దేశంలో ధనవంతులు, పేదల మధ్య గ్యాప్ గత 60 ఏళ్లలో ఇప్పుడే ఎక్కువగా ఉందని రీసెర్చ్ సంస్థ వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్‌‌ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది.  మెజార్టీ సంపద కేవలం ఒక శాతం మంది ప్రజల దగ్గరే ఉందని ,  బ్రెజిల్‌‌, యూనిటైడ్ స్టేట్స్‌‌లో కంటే ఇండియాలోనే  ఈ గ్యాప్ ఎక్కువగా ఉందని తెలిపింది.  విదేశీ పెట్టుబడులకు 1992 లో ఇండియా ఎంట్రీ ఇచ్చింది.

అప్పటి నుంచి దేశంలో బిలియనీర్ల సంఖ్య నిలకడగా పెరుగుతోంది.  2023  నాటికి దేశ సంపదలో  40.1 శాతం ధనవంతుల చేతుల్లో ఉందని వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్‌‌  స్టడీ చేసిన నితిన్ కుమార్‌‌‌‌ భారతి, థామస్‌‌ పికెట్టి పేర్కొన్నారు. 1961 తర్వాత ఇదే హయ్యెస్ట్ అని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక  ధనికులు, పేదల మధ్య అంతరం పెరిగిపోతోందని ప్రతిపక్ష  పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు  జీడీపీ గ్రోత్‌‌  కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో సగటున 8.4  శాతం వృద్ధి చెందగా, ప్రతిపక్షాలు మాత్రం ఇది మోదీ ప్రభుత్వం గిమ్మిక్ అని ఆరోపిస్తున్నాయి.  మోదీకి  అదానీ, అంబానీలకు మధ్య  దగ్గర సంబంధం ఉందని కాంగ్రెస్ చెబుతోంది. 

సరైన చదువు లేక..

ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడంతో సమాజంలోని కింది స్థాయి ప్రజలు అదే స్థాయిలో ఉండిపోతున్నారని వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్‌‌ పేర్కొంది.  తక్కువ జీతాలొచ్చే ఉద్యోగాలతో ఎక్కువ మంది జీవితం వెళ్లదీస్తున్నారని వెల్లడించింది. ఇండియాలో కింది స్థాయిలో ఉన్న 50 శాతం మంది ప్రజలు, మిడిల్ క్లాస్‌‌లోని 40 శాతం మంది ప్రజల జీతాలు పెద్దగా పెరగలేదని తెలిపింది. ఫోర్బ్స్  ర్యాంకింగ్స్ ప్రకారం, ఇండియాలో  బిలియనీర్ల సంఖ్య 1991 లో ఒకటి కాగా, 2022 నాటికి 162 కి పెరిగింది. ఆసియాలోనే అత్యంత ధనవంతులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ  ఇండియన్లే.  

వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం,  దేశంలో  టాప్‌‌ 10 వేల మంది ధనవంతుల దగ్గర సగటున రూ.2,260 కోట్ల సంపద ఉంది.  ఇది సగటు ఇండియన్ సంపద కంటే 16,763 రెట్లు ఎక్కువ. మరోవైపు సమాజంలో  సంపద గ్యాప్‌‌ను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని  కిందటేడాది డిసెంబర్‌‌‌‌లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్‌‌ పేర్కొన్నారు. సబ్సిడీతో బియ్యం, గోధుమలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని, ఎడ్యుకేషన్‌‌, హెల్త్‌‌పై ఖర్చు చేస్తున్నామని, డైరెక్ట్ క్యాష్​ ట్రాన్స్‌‌ఫర్ ద్వారా రూరల్ స్కీమ్‌‌లకు ఫండ్స్ పంపుతున్నామని, ఇవన్నీ సమాజంలో  సంపద గ్యాప్‌‌ను తగ్గించడంలో  సాయపడతాయని అన్నారు.