- అబ్జర్వర్ భారతి లక్పతి
మెదక్/పాపన్నపేట, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా పని చేయాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ అధికారులకు సూచించారు. గురువారం హవేలీ ఘన్పూర్, పాపన్నపేట మండలంలో వ్యయ పరిశీలకులు బలరాం, కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, అడిషనల్ ఎస్పీ మహేందర్ తో కలిసి నామినేషన్ల కేంద్రాలను పరిశీలించారు.
భారతి లక్పతి నాయక్ మాట్లాడుతూ..నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. నామినేషన్ దాఖలు చేసే క్రమంలో కావలసిన ధృవ పత్రాలను సమర్పించాలన్నారు. వ్యయ పరిశీలకులు బలరాం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వ్యయాలకు సంబంధించి ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉండాలని సూచించారు. సర్పంచ్, వార్డు మెంబర్లు నిబంధనలకు అనుగుణంగానే ఖర్చు పెట్టాలనే విషయం తెలియజేయాలని అధికారులకు సూచించారు.
