
భువనేశ్వర్: తనను లైంగికంగా వేధించిన లెక్చరర్పై చర్యలు తీస్కోవాలని డిమాండ్ చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఒడిశా బీఈడీ కాలేజీ స్టూడెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆస్పత్రిలో ఆమె 95 శాతం కాలిన గాయాలతో క్రిటికల్ కండిషన్లో ఉందని చెప్పారు. బాలసోర్లోని ఫకీర్ మోహన్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ సెకండియర్ చదువుతున్న 20 ఏండ్ల యువతి శనివారం కాలేజీ క్యాంపస్లోనే ఒంటికి నిప్పంటించుకున్నారు. తనను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్పై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీస్కోకపోవడంతో వారం రోజులుగా ఆందోళన చేస్తున్న ఆమె శనివారం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ప్రిన్సిపాల్ ఆఫీస్ ముందుకెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తోటి విద్యార్థులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. కొద్ది నిమిషాల్లో మంటలార్పేసి యువతిని భువనేశ్వర్లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కిడ్నీలు, లంగ్స్ దెబ్బతిన్నాయని, క్రిటికల్ కేర్ సపోర్ట్లో ఉన్నారని ఎయిమ్స్ డైరెక్టర్ ఆదివారం తెలిపారు. ఎనిమిది మందితో కూడిన డాక్టర్ల బృందం ఆమెను పర్యవేక్షిస్తున్నా, ఇప్పుడేమీ చెప్పలేమని అన్నారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝి ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా, స్టూడెంట్ను వేధించిన లెక్చరర్ సమీర్ కుమార్ సాహును పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రిన్సిపాల్ను ప్రభుత్వం తొలగించింది.