కరోనా ట్రీట్మెంట్ కు ఆఫీస్ డబ్బులు వాడుకుని.. చెల్లించలేక ఉద్యోగి ఆత్మహత్య
తల్లాడ, వెలుగు: కరోనా ట్రీట్మెంట్ కోసం వాడుకున్న కంపెనీ డబ్బులు తిరిగి కట్టలేక ఓ ప్రైవేట్ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రానికి చెందిన షేక్ జానీమియా(27) ఓ ప్రైవేట్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్. నెల జీతం రూ. 15 వేలు. ఇటీవల జానీమియాకు కరోనా సోకింది. ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కు రూ. 2 లక్షలకు పైగా ఖర్చయ్యింది. హాస్పిటల్ ఖర్చులకు కంపెనీ కలెక్షన్డబ్బులు వాడుకున్నాడు. కోలుకున్నాక కంపెనీకి కొంత చెల్లించాడు. మిగిలిన మొత్తం ఎలా కట్టాలో అర్థం కాక ఆందోళను గురవుతున్నాడు. రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బైక్పై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం తల్లాడ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో డెడ్బాడీ ఉన్నట్టు చేపల వేటకు వెళ్లిన కొంతమంది పోలీసులు, గ్రామస్తులకు సమాచారం అందించారు. అది జానీమియా మృతదేహంగా కుటుంబసభ్యులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం కోసం డెడ్బాడీని మధిర ప్రభుత్వ దవాఖానకు తరలించారు.