కామారెడ్డి జిల్లాలో ఉద్యాన సాగుపై ఫోకస్.. కూరగాయలు, పండ్లు, పూల తోటల పెంపకానికి సబ్సిడీలు

కామారెడ్డి జిల్లాలో ఉద్యాన సాగుపై ఫోకస్.. కూరగాయలు, పండ్లు, పూల తోటల పెంపకానికి సబ్సిడీలు
  • కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 435 ఎకరాలకు నారు అందజేత 

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఉద్యానవన పంటల సాగు పెంపుపై  అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది జిల్లాలో 435 ఎకరాల సాగుకు సబ్సిడీపై నారు ఇవ్వనున్నారు. మొక్కకు రూ. 10 పైసలు రైతు చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ నీటితో ఎక్కువ సాగుకు డ్రిప్ పరికరాలను సబ్సిడీపై అందజేయనున్నారు. వ్యవసాయ జిల్లా అయినప్పటికీ  స్థానిక అవసరాలకు సరిపడా కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగవట్లేదు.

ఇతర స్టేట్స్, సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల అధిక రేట్లకు విక్రయించాల్సి వస్తోంది. జిల్లాలో 6,078 వేల ఎకరాల్లో పండ్ల తోటలు, కూరగాయలు, పూల తోటలు సాగవుతుండగా, కూరగాయలు సాగయ్యేది  1,250 ఎకరాల్లో మాత్రమే. పండ్ల తోటల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి.  టమాట,  బెండ, బీర, వంకాయ, కాకర, పచ్చిమిర్చి వంటివి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. రాజంపేట, భిక్కనూరు, తాడ్వాయి, సదాశివనగర్, కామారెడ్డి,  బిచ్ కుంద మండలాల్లో ఉద్యాన పంటల సాగు అధికంగా ఉంది.  

ఈసారి సబ్సిడీ ఇలా.. 

కూరగాయల సాగు 125 ఎకరాలు,  మిగతా 310 ఎకరాల్లో ఉల్లి, మిర్చి, డ్రాగన్​ ప్రూట్స్​, మ్యాంగో, బొప్పాయి, ఆవకోడ్​, పూల తోటలు ఉన్నాయి. మొక్కకు రూ.10 పైసలు చెల్లిస్తే మిగతా అమౌంట్ హార్చికల్చర్ శాఖ భరించనుంది. సాగుకు అవసరమైన సూచనలు, సలహాలు  అధికారులు అందించనున్నారు. రాష్ర్టీయ కృషి వికాస్ యోజన కింద (ఆర్​కేవీవై) శాశ్వత పందిళ్ల యూనిట్స్ జిల్లాకు 50 ఉన్నాయి.  దీనికి రూ. 25 లక్షలు కేటాయించారు.

ఒక్కో యూనిట్​కు రూ. లక్ష  కాగా, ఇందులో రైతు రూ. 50 వేలు భరిస్తే  సబ్సిడీ రూ. 50వేలు ఇస్తారు. తీగజాతి కూరగాయల సాగుకు పందిళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు.  బిందు సేద్యం 291 ఎకరాలు, తుంపర సేద్యానికి 167 ఎకరాలు సాగు కానుంది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ,  బీసీ, చిన్న , మధ్య తరహా రైతులకు 90 శాతం, మిగతా రైతులకు 80 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు.   

మార్కెటింగ్​, నిల్వ సౌకర్యం లేదు.. 

కూరగాయలు, పండ్లు, పూల సాగుకు సరైన మార్కెటింగ్, నిల్వ సౌకర్యం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కూరగాయల దిగుబడులు రాగానే మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయి. ఉల్లి, ఇతర కూరగాయల నిల్వ చేసేందుకు గోదాంలు లేవు.  జిల్లా కేంద్రంలో సరైన మార్కెట్ సౌకర్యం లేదు. 

మార్కెట్​ సౌకర్యం కల్పించాలి

కూరగాయల దిగుబడి రాగానే మార్కెట్లో రేటు తగ్గుతుంది. టమాట, ఆకు కూరలు వేస్తా.  ప్రస్తుతం పాలకూర, తోటకూర పెట్టా.  కొద్ది రోజుల క్రితం టమాట 25 కిలోల బుట్ట రూ. 100కు అమ్మాం. ఏ మాత్రం గిట్టుబాటు కాలేదు. సరైన మార్కెటింగ్​ సౌకర్యం కల్పించాలి. - చిట్కూరి లింగం,లింగాపూర్​ 

ఉద్యాన పంటలతో లాభాలు

ఉద్యాన పంటలతో మంచి లాభాలు వస్తాయి. కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలి. ఈసారి సబ్సిడీపై కూరగాయల నారు ఇస్తున్నాం. డ్రిప్ ఏర్పాటుకు సబ్సిడీ వస్తుంది. సాగు విస్తీర్ణం పెంచేలా అవగాహన కల్పిస్తున్నాం.   - జ్యోతి, జిల్లా హార్చికల్చర్ అధికారి