
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అనేక రాయితీలపై కోత విధించిన మెట్రో ఇకపై టాయిలెట్లకు సర్వీస్ టాక్స్ వసూలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మొన్నటి మొన్న స్మార్ట్కార్డులు, క్యూఆర్కోడ్లపై ఉన్న 10 శాతం రాయితీపై కోత పెట్టిన విషయం తెలిసిందే. రద్దీ లేని వేళలకు మాత్రమే ఈ రాయితీని పరిమితం చేశారు. అంతేకాకుండా సెలవు రోజుల్లో అందుబాటులో ఉన్న రూ. 59 అన్లిమిటెడ్ ట్రావల్ టికెట్ను సైతం రూ. 100 పెంచేశారు. ప్రయాణికులకు ఇలా వరుస షాక్లు ఇస్తున్న మెట్రో తాజాగా మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది.
టాయిలెట్ చార్జి ఎంతంటే...
ఇప్పుడు ఏకంగా టాయిలెట్ వాడకం పై చార్జీ వసూలు చేస్తామని ప్రకటించి ప్రయాణికులపై మరింత భారాన్ని పెంచింది. నగరంలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్లలో కొన్నింటిలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు వాటిని ఉపయోగించినందుకు ప్రయాణికుల నుంచి ఎటువంటి రుసుం వసూలు చేయలేదు. కానీ ఇకపై టాయిలెట్స్ వాడితే డబ్బులు వసూలు చేయనున్నారు. మెట్రో స్టేషన్ లో టాయిలెట్ వాడకానికి రూ.5, యూరినల్ వాడకానికి రూ.2 వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చార్జీలను నేటి నుంచే (జూన్ 02) అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. .
ప్రయాణికుల్లో అసహనం
హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతున్న తరుణంలో దేశం నలుమూలల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతుండడంతో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతంది. ఈ సమస్యను తీర్చడానికి ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ తో పాటు ప్రభుత్వం కూడా పలు రకాల చర్యలు తీసుకుంటుంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్లైఓవర్ల నిర్మాణం, అండర్ వేస్ నిర్మించి ట్రాఫిక్ సమస్యను తీరుస్తున్నారు. దీంతో పాటు మెట్రోను నిర్మించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఇప్పుడు ఆదాయ మార్గాలను పెంచుకునే లక్ష్యంతో మెట్రో స్టేషన్లలో టాయిలెట్లకు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది.దీంతో ప్రయాణికులు అసహనానికి లోనవుతున్నారు