- ఆన్లైన్లో వివరాల సేకరణ
హైదరాబాద్, వెలుగు: టీచర్ల బదిలీలకు సర్కారు సిద్ధమవుతోంది. ముందుగా టీచర్ల వివరాలను సేకరించాలని సర్కారు నిర్ణయించింది. అందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26,065 సర్కారు స్కూళ్లలో 1.03లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం 8 ఏండ్ల సర్వీస్ నిండిన టీచర్లు, ఐదేండ్లు సర్వీస్ పూర్తయిన హెడ్మాస్టర్లు తప్పనిసరిగా ఇతర స్కూళ్లకు బదిలీ కావాల్సి ఉంది. 2012లో బదిలీలు పొందిన టీచర్లు ఇప్పటికీ ఉన్నచోటే పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా టీచర్లు, హెడ్మాస్టర్లను జిల్లాలు, జోన్లకు అలాట్ చేశారు. దీంతో టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టాలని సర్కారు యోచిస్తోంది. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ల ప్రక్రియ చేపట్టే ఆలోచన ఉండటంతో టీచర్ల పూర్తి వివరాలు సేకరించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. వారం పదిరోజుల్లో ఈ వివరాలను సేకరించేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఆ తర్వాత బదిలీలు ప్రక్రియ ప్రారంభించే అవకాశాలున్నాయని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి.