
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ముడి చమురు ధరలపై పడింది. ముడి చమురు ధరలు సోమవారం రోజు 2.8 శాతం పెరగడంతో 5 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం.. సోమవారం(జూన్ 23, 2025) ఉదయం 7 గంటల 45 నిమిషాల సమయానికి బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.7 శాతం పెరిగి 79.12 డాలర్లకు చేరుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా యూఎస్లో క్రూడ్ బ్యారెల్ ధర 2.8 శాతం పెరిగి 75.98 డాలర్లకు చేరడం గమనార్హం.
జూన్ 13న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మొదలైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 13 శాతం పెరిగాయి. అమెరికా దాడులను తీవ్రంగా పరిగణించిన ఇరాన్ ఆయిల్ షిప్పింగ్లో ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు నిర్ణయించింది. ఇరాన్ పార్లమెంట్ కూడా దీనికి ఆమోదించింది. అమెరికా ఇరాన్ తో నేరుగా ప్రత్యక్ష యుద్ధానికి దిగడం, ఇరాన్ అణు కేంద్రాలపై మిస్సైల్స్ దాడులు చేయడం.. ప్రతిగా హర్మూజ్ జలసంధి క్లోజ్ చేయాలని ఇరాన్ డిసైడ్ అవడం.. ఈ కారణాలన్నీ ముడి చమురు ధరలు పెరగడానికి కారణమయ్యాయి.
వరల్డ్వైడ్గా ఎంతో కీలకమైన చెక్ పాయింట్లలో హర్మూజ్ ఒకటి. ప్రపంచం మొత్తానికి సప్లై అయ్యే చమురు, గ్యాస్లో ఐదో వంతు ఇక్కడి నుంచే పాస్ అవుతుంది. ఈ జలసంధి.. పార్శియన్ గల్ఫ్, అరేబియా, హిందూ మహా సముద్రాలను కలుపుతుంది. హర్మూజ్ మూసివేస్తే 2కోట్ల క్రూడాయిల్ బ్యారెల్స్ సరఫరా ఆగిపోతుంది. దీంతో చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల నుంచి 130 డాలర్లకు పైగా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే వారం రోజులుగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. వ్యవసాయం, ట్రాన్స్పోర్టేషన్, ప్రొడక్టివిటీపై తీవ్ర ప్రభావం పడి ఖర్చులు పెరుగుతాయి. చివరికి ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.
ఇండియా తన చమురు దిగుమతుల్లో 67 శాతం, లిక్విడ్ నేచురల్ గ్యాస్ ఇంపోర్ట్లో 50శాతం హర్మూజ్ జలసంధి ద్వారా పొందుతుంది. ఈ జలసంధి మూసేస్తే రోజుకు 20 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ సప్లై ఆగిపోతుంది. ఫలితంగా ఇంధన కొరత ఏర్పడి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయంగా అమెరికా, బ్రెజిల్, రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసి కొరతను అధిగమించొచ్చు. అయితే.. ఇలా జరగకపోతే ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ 107 రూపాయల 41 పైసలుగా ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్త పరిస్థితులు ఇలానే కొనసాగితే లీటర్ పెట్రోల్ 110 రూపాయలకు పోయినా ఆశ్చర్యపడనక్కర్లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.