
- డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 30 లక్షలు కొట్టేశారు
- దంపతులను 50 గంటల పాటు నిర్బంధించిన సైబర్నేరగాళ్లు
- బంగారం తాకట్టు పెట్టి మరో రూ. 20 లక్షలు
- ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి
- మోసాన్ని గుర్తించిన వృద్ధుడి స్నేహితుడు, సైబర్ క్రైమ్కు ఫిర్యాదు
నిజామాబాద్, వెలుగు : డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంపతులను 50 గంటల పాటు నిర్బంధించిన సైబర్ నేరగాళ్లు రూ. 30 లక్షలను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మరో రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో వారి ఫ్రెండ్ మోసాన్ని పసిగట్టి సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే...
నిజామాబాద్లోని వినాయకనగర్కు చెందిన 78 ఏండ్ల వృద్ధుడికి ఇద్దరు పిల్లలు. వారు విదేశాల్లో ఉండగా.. భార్యభర్తలిద్దరూ స్థానికంగా ఉంటున్నారు. వృద్ధుడి మొబైల్కు ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. ‘మేము ముంబై పోలీసులం.. ఓ మనీలాండరింగ్ కేసులో మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంది.. మిమ్ములను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం’ అని బెదిరించారు.
వృద్ధుడికి నమ్మకం కలిగించేందుకు కోర్టు, సీబీఐ, ట్రాయ్, ఆర్బీఐ పేరుతో వాట్సప్ మెసేజ్లు పంపించారు. వృద్ధుడితో పాటు అతడి భార్యను ఆదివారం నుంచి మంగళవారం ఉదయం 11.30 గంటల వరకు సుమారు 50 గంటల పాటు నిర్బంధించారు.
ఈ క్రమంలో బ్యాంక్ లావాదేవీలు చెక్ చేయాలంటూ వృద్ధుడి అకౌంట్ నుంచి రూ. 30 లక్షలను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అలాగే లాకర్లో బంగారం ఉన్నట్లు తెలుసుతున్న సైబర్ నేరగాళ్లు దానిని తాకట్టు పెట్టి ఆ డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి చేశారు.
దీంతో సదరు వృద్ధుడు తన ఫ్రెండ్కు ఫోన్ చేసి గోల్డ్ను తాకట్టు పెట్టించాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన వృద్ధుడి ఫ్రెండ్ వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఆఫీసర్లు వృద్ధుడి అకౌంట్ నుంచి మరో రూ.20 లక్షలు ట్రాన్స్ఫర్ కాకుండా అకౌంట్ను హోల్డ్ చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన సిబ్బంది వెంకటేశ్వర్రావు, శ్రీరాంను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ అభినందించారు.