ఒకప్పుడు ఆ గోడలు రంగు వెలసిపోయి, దుమ్ము పట్టి ఉండేవి. వాటిపక్కనే చెత్తాచెదారం వేసేవాళ్లు. అలాంటి గోడలు ఇప్పుడు కొత్త రంగులద్దుకున్నాయి. మనదేశ చరిత్రని, ఈ నేలపై పుట్టిన మహనీయుల బొమ్మలతో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఈ బొమ్మలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ప్రతి బొమ్మ పక్కన క్యుఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే ఆ బొమ్మకి సంబంధించి వివరాలు తెలుస్తాయి. ఈ వాల్ ఆర్ట్ వెనుక బెంగళూరుకు చెందిన ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ‘ఫ్రీడమ్ వాల్’ ప్రాజెక్ట్లో భాగంగా పాత గోడలకు కొత్త సొబగులు అద్దుతున్నారు వీళ్లు.
బెంగళూరులోని సివి. రామన్ హాస్పిటల్ రోడ్డు, ఫిఫ్త్ క్రాస్ రోడ్డుని ‘ఫ్రీడమ్ వాల్’ గా మార్చేశారు దుశ్యంత్ దూబె, సమీర్ కులకర్ణి, సత్యజిత్ ఇంద్రమోహన్. వీళ్లకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. రోజూ అదే దారి గుండా వెళ్లేవాళ్లు ఈ ముగ్గురు. స్కూలు పిల్లలు, హాస్పిటల్కి వచ్చేవాళ్లు ఆ దారిలో వెళ్లేందుకు ఇబ్బంది పడడం గమనించారు. అధ్వానంగా ఉన్న ఆ గోడలకు రంగులు వేసి, అందంగా మార్చాలనుకున్నారు. ఇదే విషయం అక్కడివాళ్లకు చెప్పారు. అందరూ కలిసి లోకల్ ఎమ్మెల్యేను కలిశారు. ఆయన అందుకు ఒప్పుకోవడంతో పాటు డబ్బు సాయం కూడా చేశాడు. దాంతో ఏప్రిల్ నెలలో ‘ఫ్రీడమ్ వాల్’ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు ఈ ముగ్గురు. పెయింటర్స్, ఇలుస్ట్రేటర్స్ వీళ్లతో చేతులు కలిపారు. వీళ్ల ఆలోచన నచ్చి ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇటలీ, కొలంబియా నుంచి కూడా ఆర్టిస్ట్లు బొమ్మలు వేసేందుకు ముందుకొచ్చారు.
క్యుఆర్ కోడ్ స్కాన్ చేసి..
చంద్రశేఖర్ ఆజాద్, గణిత మేధావి శ్రీనివాస రామానుజన్తో పాటు కర్నాటకకు చెందిన సి.వి.రామన్, మహాకవి కువెంపుతో పాటు శ్రీకృష్ణ దేవరాయలు, ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య బొమ్మలు కనిపిస్తాయి. జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పెద్దపులిని కూడా చూడొచ్చు. ప్రతి బొమ్మ పక్కన క్యుఆర్ కోడ్ ఉండడం ఈ ఫ్రీడమ్ వాల్ ప్రత్యేకత. ఆ కోడ్ని స్కాన్ చేస్తే వికీపీడియా, బ్రిటానిక వంటి ఎన్సైక్లోపీడియా సైట్స్ ఓపెన్ అవుతాయి. వాటిలో ఆ ఫొటోలోని వ్యక్తి వివరాలు ఉంటాయి. మీకు తెలిసిన భాషలో ఆడియో కూడా వినొచ్చు. వీళ్ల ఆర్ట్వర్క్చూసి అహ్మదాబాద్లో కూడా ఫ్రీడమ్ వాల్ క్రియేట్ చేయాలని కోరింది గుజరాత్ ప్రభుత్వం.
ఈజీగా అర్థమయ్యేలా...
‘‘మనదేశానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు, రాజులు, సైంటిస్ట్లు, పర్యావరణవేత్తల్ని గుర్తు చేయాలనేది మా ప్రాజెక్ట్ ఉద్దేశం. మా ఆర్ట్వర్క్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు గోడల మీద 58 బొమ్మలు వేశాం. ఆ బొమ్మల్లోని వ్యక్తుల్ని మొదటిసారి చూసినవాళ్లకు కూడా వాళ్లు ఎందుకు పాపులర్ అయ్యారో అర్థమయ్యేలా బొమ్మలు వేశాం” అంటున్నాడు ఈ ప్రాజెక్ట్ క్రియేటివ్ డిజైనర్ దుశ్యంత్ దూబె.
