- వారిని పోలింగ్ బూత్కు రప్పించడంపై బీజేపీ నజర్
- ‘గ్రాడ్యుయేట్’ ఎన్నికల్లో గెలుపుకు పార్టీ నేతల కసరత్తు
- సర్కారుపై వ్యతిరేకత వరంగల్లో కలిసివస్తుందన్న ధీమా
హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. మామూలు ఎన్నికలకు ఇవి భిన్నమైనవి కావడంతో.. ప్రచారంతో పాటు ఓటర్లపైనా ఫోకస్ పెట్టింది. వాళ్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడమే కీలకమని భావిస్తోంది. కొద్ది రోజుల కిందట ప్రచారం కోసం వచ్చిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా.. పార్టీ రాష్ట్ర నేతలకు ఇదే విషయాన్ని చెప్పారు. ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు రప్పిండమే లక్ష్యంగా 25 మంది ఓటర్లకో ఇన్చార్జ్ను పార్టీ నియమించింది. ఎప్పటికప్పుడు వారితో ఆ ఇన్చార్జ్ టచ్లో ఉంటూ పోలింగ్బూత్ వరకు తీసుకొచ్చి ఓటేయించే బాధ్యతలను అప్పగించింది. బీజేపీకి మద్దతుగా ఓటర్లను కూడగట్టేందుకు సంఘ్ పరివార్ కూడా బరిలోకి దిగింది. ఆరెస్సెస్, వీహెచ్పీ, బజరంగ్దళ్, హిందూ వాహిని, పలు అనుబంధ సంస్థలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి.
వరంగల్ను దక్కించుకోవాలని..
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల జోష్లో ఉన్న బీజేపీ.. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ హైదరాబాద్స్థానాన్ని కాపాడుకోవడంతో పాటు వరంగల్నూ గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో వరంగల్లో బీజేపీకి రెండో స్థానం దక్కింది. అప్పుడు పరిస్థితులన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని, దాని వల్లే రెండో స్థానంలో నిలిచామని పార్టీ నేతలు అంటున్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని, కేసీఆర్ సర్కార్పై చదువుకున్నోళ్లు, ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, అదే తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. పార్టీ గెలుపు కోసం ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, లక్ష్మణ్, జితేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావులు హైదరాబాద్, వరంగల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్లో గెలుస్తామన్న ధీమాతో ఉన్న నేతలు.. కొంచెం కష్టపడితే వరంగల్లోనూ గెలవొచ్చని భావిస్తున్నారు.