
కామారెడ్డి: స్నేహితుల మధ్య సరదాగా సాగిన పందెం కాస్త వికటించి విషాదాన్ని నింపింది. నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ మద్యం ఒక్కడే తాగడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ శాంతినగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
శాంతినగర్ కాలనీకి చెందిన సోమేశ్వరం సాయిలు(40) తన ఐదుగురు స్నేహితులతో కలిసి శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లాడు. అందరూ కలిసి పార్టీ చేసుకునేందుకు మద్యం తెచ్చుకున్నారు. బాగా తాగిన తర్వాత మాటా మాటా పెరిగి పందెం వరకు వెళ్లింది. ఇద్దరు వ్యక్తులు నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ తాగుతామని పందెం కాశారు. ఆ తర్వాత అంతా ఇంటికి చేరుకోగా.. కొంతసేపటికి సాయిలు నోటీ నుంచి నురుగ రావడం మొదలైంది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ పరిస్థితి విషమించింది. దీంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.