ఆర్డీవో కూడా ఉన్నట్లు సమాచారం
కలెక్టర్ ద్వారా మ్యుటేషన్ కు ప్లాన్
ఏసీబీ రిమాండ్ రిపోర్ట్లో నాగరాజు, శ్రీనాథ్
వరంగల్లోనే రూ.1.10కోట్లు కలెక్షన్
హైదరాబాద్, వెలుగు: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు అవినీతి కేసు ఇన్వెస్టిగేషన్ లో ఏసీబీ స్పీడ్ పెంచింది. రూ.1.10 కోట్ల లంచం డబ్బులు, నాగరాజు ఇంట్లో స్వాధీనం చేసుకున్న రూ.36 లక్షల క్యాష్తో పాటు బంగారం వివరాలు రాబడుతున్నారు. నాగరాజు, వీఆర్ఏ సాయిరాజ్, సత్య డెవలపర్స్ శ్రీనాథ్, రియల్టర్ కందాడి అంజిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితులు చేసిన భూదందా వివరాలను ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు వెల్లడించారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మేడ్చల్ జిల్లా రెవెన్యూ అధికారులు, కీసర ఆర్డీవో ఆదేశాలతో ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది.
హన్మకొండ తహసీల్దార్పై ఏసీబీ నిఘా….!
హన్మకొండ తహసీల్దార్ కిరణ్ ప్రకాశ్ ద్వారా కీసర ఆర్డీవో రవికుమార్ పరిచయం అయ్యాడని నాగరాజు ఏసీబీకి ఇచ్చిన స్టేట్మెంట్లో తెలిపాడు. మార్చిలో కీసర ఆర్డీవో పరిచయం అయ్యాక దయారా ల్యాండ్ మ్యుటేషన్ కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు నాగరాజు పేర్కొన్నాడు. దీని కోసం కాప్రాలోని అంజిరెడ్డి గెస్ట్హౌస్లో కలిసినట్లు చెప్పాడు. కలెక్టర్తో మ్యుటేషన్ ను ఆర్డీవో రవి, తహసీల్దార్ నాగరాజు చూసుకుంటామని చెప్పినట్లు సత్య డెవలపర్స్ శ్రీనాథ్ వెల్లడించాడు. ఇందుకోసం హన్మకొండలో ని తన బిజినెస్ పార్ట్నర్ ముద్దెడి తేజశ్వర్ , వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిడ్డి కుమార స్వామి వద్ద రూ.70 లక్షలు, డాక్టర్ బి.ప్రభాకర్ వద్ద రూ.30 లక్షలు, రత్నం రాజిరెడ్డి, ఆర్ఎల్ రవి వద్ద రూ.10 లక్షలు తీసుకున్నాని చెప్పాడు. ఇలా మొత్తం రూ.1.10 కోట్లు తీసుకుని హైదరాబాద్ వచ్చానని తెలిపాడు.