
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచా..
- హామీల అమలు కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్న
- స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
వరంగల్, వెలుగు : ‘నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను.. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. నేను ఏ పార్టీలో ఉన్నానన్న విషయం స్పీకర్ టేబుల్పై ఉంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఈ నెలాఖరు వరకు టైముంది.
అన్నింటికీ సిద్ధంగానే ఉన్నా’ అని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. హనుమమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా.. శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు.
ఆ 36 మందిలో ఏ ఒక్కరూ రాజీనామా చేయలేదు.. డిస్ క్వాలిఫై కాలేదన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ చేస్తే ఒప్పు.. తాము చేస్తే తప్పా అని ప్రశ్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగు, తాగు నీరు, కరెంట్ ప్రాజెక్టుల కోసం 2024 జనవరి నుంచి సీఎం రేవంత్రెడ్డి రూ.1,025.64 కోట్లు ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా.. నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకట్ట వేశారని ఆరోపించారు.
కొందరు వ్యక్తులు కావాలనే చౌకబారు విమర్శలు చేస్తున్నారని, ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు కూడా రాజకీయ అంశాలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. సభ్యత లేకుండా మాట్లాడిన వారి మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. విధానాలపై విమర్శించాలి తప్పితే వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. చిల్లర, చిలిపి చేష్టలతో నియోజకవర్గానికి చెడు పేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు