తరచూ ఎలక్షన్లతో అభివృద్ధి పనులపై ఎఫెక్ట్
ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో ప్రధాని మోడీ
కెవాడియా /న్యూఢిల్లీ: మన దేశానికి ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ చాలా అవసరమని ప్రధాని మోడీ అన్నారు. ఆయా ప్రాంతాల్లో కొన్ని నెలల వ్యవధిలోనే ఎన్నికలు జరగుతుండటం వల్ల అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోందని చెప్పారు. గురువారం 80వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ముగింపు సమావేశంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా 26/11 ముంబై టెర్రర్ అటాక్ బాధితులకు నివాళులర్పించారు. ఇండియా ఇప్పుడు కొత్త పాలసీ, కొత్త ప్రాసెస్తో టెర్రరిజంపై పోరాడుతోందన్నారు.
వేర్వేరు ఓటర్ లిస్టులు వద్దు
జమిలి ఎన్నికలు అనేవి చర్చించాల్సిన అంశమే కాదు.. దేశానికి చాలా అవసరమని ప్రధాని తెలిపారు. ‘‘కొన్ని నెలలకు ఒకసారి వివిధ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి ప్రభావం అభివృద్ధి పనులపై పడుతోంది. అందుకే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంశంపై లోతైన స్టడీలు, చర్చలు జరగాలి” అని చెప్పారు. అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు లిస్టు ఉండాలని ప్రధాని సూచించారు. లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీ తదితర ఎన్నికలకు ఒకే జాబితా ఉండాలని, వేర్వేరు లిస్టుల వల్ల వనరుల వృథా తప్ప ఇంకేం లేదన్నారు. జమిలి ఎన్నికల కోసం లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ సమన్వయంతో పని చేయాలని, దేశ ప్రయోజనాలే ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
నేషన్ ఫస్ట్..
‘నేషన్ ఫస్ట్’ విధానాల విషయంలో రాజకీయాలు చేస్తే.. దేశం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధాని హెచ్చరించారు. ‘‘ఇందుకు సర్దార్ సరోవర్ డ్యామ్ ఒక ఉదాహరణ. దీన్ని చాన్నాళ్లు పొడిగించారు. చాలా ఏళ్ల తర్వాత పూర్తి చేశారు. అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే.. డ్యాం ఎప్పుడో పూర్తయ్యేది. ఆ పనులు నిలిపేసిన వారికి కనీసం పశ్చాత్తాపం కూడా లేదు’’ అని పరోక్షంగా కాంగ్రెస్ను విమర్శించారు. రాజకీయాల్లో అంటరానితనానికి స్థానం లేదని మోడీ చెప్పారు. బీజేపీ, జన సంఘ్కు చెందిన వ్యక్తి కాకపోయినా.. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో తమ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు.
‘కేవైసీ’ ఉండాలె
కార్పొరేట్ ప్రపంచంలో కేవైసీ (నో యువర్ కస్టమర్) ఉంటుందని.. అట్లనే రాజ్యాంగానికి ప్రచారం కల్పించేందుకు కేవైసీ (నో యువర్ కాన్స్టిట్యూషన్) డ్రైవ్ ప్రారంభించాలని ప్రధాని సూచించారు. రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని కోరారు.
రెన్యువెబుల్ పవర్ లో 4వ స్థానంలో ఉన్నాం : ప్రధాని మోడీ
రెన్యువెబుల్ పవర్ రంగంలో ఇండియా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ రంగంలో అన్ని ప్రధాన దేశాల కంటే వేగంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గురువారం 3వ ‘గ్లోబల్ రెన్యువెబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్ మెంట్ మీట్ అండ్ ఎక్స్ పో 2020 (రీఇన్వెస్ట్ 2020)’ను ప్రారంభించిన అనంతరం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం రెన్యువెబుల్ ఎనర్జీ కెపాసిటీ 136 గిగా వాట్లకు పెరిగిందని, మొత్తం ఎనర్జీ కెపాసిటీలో ఇది 36 శాతమని చెప్పారు. దేశంలో ఆరేళ్లుగా రెన్యువెబుల్ ఎనర్జీ కెపాసిటీ 2.5 రెట్లు పెరిగిందన్నారు. ఖర్చుతో కూడుకున్నదైనా ఇందులో ఇన్వెస్ట్ మెంట్ పెట్టామని, ఇప్పుడు ఈ ఎనర్జీ కాస్ట్ గణనీయంగా తగ్గిపోయిందన్నారు. పర్యావరణానికి మేలు చేసే చర్యలతో ఆర్థికంగానూ లాభం ఉంటుందని ఇండియా ప్రపంచానికి చాటుతోందని ప్రధాని తెలిపారు.
రాజ్యాంగం తొవ్వ చూపుతది
21వ సెంచరీలో ఎదురయ్యే సవాళ్లనుఎదుర్కొనేందుకు రాజ్యాంగమే ‘గైడింగ్ లైట్’ అని మోడీ చెప్పారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దేశ ప్రయోజనాలే ప్రాతిపదికగా ఉండాలన్నారు. ‘‘మన రాజ్యాంగంలో డ్యూటీస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గాంధీజీ ఈ విషయంలో ఎంతో ఆసక్తిగా ఉండేవారు. హక్కులు, విధులకు మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్లు గమనించారు. మన డ్యూటీ మనం చేస్తే.. హక్కులు రక్షించబడతాయనేవారు.
రాజ్యాంగ రూపకర్తలకు నివాళి
గురువారం కాన్ స్టిట్యూషన్ డే సందర్భంగా రాజ్యాంగ రూపకర్తలకు మోడీ నివాళులర్పించారు. వారు కలలు కన్న ఇండియాను నిర్మించాలనే తమ నిబద్ధతను మళ్లీ గుర్తు చేయాల్సిన రోజు ఇది అని చెప్పారు. ప్రధాని ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 2015 నుంచి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Read more news…