బెట్టింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌కు చెక్‌‌‌‌‌‌‌‌ ..పైసలు పెట్టి ఆడితే భారీ ఫైన్..సెలబ్రిటీ ప్రచారాలపై నిషేదం

బెట్టింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌కు చెక్‌‌‌‌‌‌‌‌ ..పైసలు పెట్టి ఆడితే  భారీ ఫైన్..సెలబ్రిటీ ప్రచారాలపై నిషేదం
  • ఇకపై బెట్టింగ్ నిర్వహించే యాప్స్‌‌‌‌‌‌‌‌పై నిషేధం
  • అలాంటి వాటికి సెలబ్రెటీలు ప్రచారం చేస్తే చర్యలు
  • బిల్లును నేడు లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రవేశపెట్టే అవకాశం


న్యూడిల్లీ:  అక్రమాలకు పాల్పడుతున్న  బెట్టింగ్​ యాప్స్​ను, ఆన్‌‌‌‌లైన్ గేమింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్స్​ను నియంత్రించడానికి కేంద్రం ప్రభుత్వం రెడీ అయింది. ఆన్‌‌‌‌లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత చట్టం ప్రకారం.. ఆన్​లైన్​లో డబ్బులు పెట్టి ఆటలు ఆడితే భారీగా జరిమానాలు వేస్తారు. ప్లాట్​ఫారంపై నిషేధం కూడా విధిస్తారు. బెట్టింగ్‌‌‌‌కు సంబంధించిన గేమింగ్ యాప్‌‌‌‌లకు సెలబ్రిటీలు ప్రచారం చేయకూడదు. ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈ బిల్లును బుధవారం లోక్‌‌‌‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  వినోదం ఆధారిత ఆన్‌‌‌‌లైన్ ఆటలకు, డబ్బు, పందెంతో వాటికి మధ్య స్పష్టమైన గీత గీయాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. 

అయితే, సాధారణ ఆన్‌‌‌‌లైన్ గేమ్‌‌‌‌లకు పరిమితులు ఉండవు.   బెట్టింగ్‌‌‌‌కు సంబంధించిన గేమింగ్​ యాప్‌‌‌‌లను సిన్ గూడ్స్ జీఎస్టీ వర్గం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటికి 40 శాతం వరకు పన్ను విధించాలని భావిస్తోంది. ప్రస్తుతం, ఆన్‌‌‌‌లైన్ గేమింగ్‌‌‌‌పై 28శాతం జీఎస్​టీ, గెలుచుకున్న మొత్తంపై 30 శాతం పన్ను విధిస్తున్నారు. ఈ బిల్లు ఐటీ చట్టం 2000, మనీలాండరింగ్​ నిరోధక చట్టం (పీఎంఎల్​ఏ) వంటి చట్టాలను ఉపయోగించి ఆన్‌‌‌‌లైన్​ అక్రమ బెట్టింగ్‌‌‌‌లను అడ్డుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్రమ, నాన్–రిజిస్టర్డ్​ సైట్లను బ్లాక్​ చేయడానికి కూడా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.  ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం ఆన్‌‌‌‌లైన్ గేమింగ్ రంగంపై నిఘా పెంచింది. 2023 అక్టోబర్ నుంచి ఆన్‌‌‌‌లైన్ గేమింగ్‌‌‌‌పై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది.  పన్ను పరిధిని ఆఫ్​షోర్ ప్లాట్‌‌‌‌ఫామ్స్​కు కూడా విస్తరించారు. నాన్​–రిజిస్టర్డ్​, అక్రమ సైట్ల నిరోధించే అధికారాన్ని అధికారులకు ఇచ్చారు. భారతదేశ ఆన్‌‌‌‌లైన్ గేమింగ్ పరిశ్రమ 2029 నాటికి 9.1 బిలియన్​డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అయితే చాలా మంది బెట్టింగ్​ యాప్స్​కు బానిసలవుతున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. దీంతో వీటి యాడ్స్​ను నిషేధించారు. పన్నులను పెంచారు.