- పెరుగుతున్న షాపింగ్ మోసాలు,ఫేక్ జాబ్ స్కామ్స్
- స్కామ్ కాల్స్, మెసేజ్లు వచ్చాయన్న 54 శాతం మంది పట్టణ వాసులు
- మగవారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్న మోసగాళ్లు
- వెల్లడించిన యూగవ్ సర్వే
న్యూఢిల్లీ : ఆన్లైన్ స్కామ్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కాల్స్, మెసేజ్లు లేదా ఈ–మెయిల్స్ ద్వారా పట్టణాల్లోని 54 శాతం మందిని వారానికి ఒకసారి అయినా మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారని యూగవ్ ఇండియా సర్వే వెల్లడించింది. 30 శాతం మంది అయితే ప్రతి రోజూ ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ఆన్లైన్లో ఫేక్ వస్తువులను అమ్మడం, ఫేక్ జాబ్ స్కామ్స్ టాప్లో ఉన్నాయని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న సుమారు 25 శాతం మంది ఇటువంటి స్కామ్ల బారిన పడ్డామని పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్లో 1,022 మంది రెస్పాండెంట్ల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేను యూగవ్ ఆన్లైన్లో చేసింది. మొత్తం 180 సిటీలకు చెందిన రెసిడెంట్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆన్లైన్ స్కామ్స్తో డబ్బులు నష్టపోయామని 20 శాతం మంది చెప్పగా, 47 శాతం మంది మాత్రం తమకు తెలిసిన వారు ఇటువంటి స్కామ్లకు బలయ్యారని పేర్కొన్నారు. స్కామ్ మెసేజ్లు, కాల్స్, ఈ–మెయిల్స్ను మహిళల (24 శాతం మంది) కంటే మగవారికే (35 శాతం) ఎక్కువగా వస్తున్నాయని యూగవ్ వెల్లడించింది. ఫైనాన్షియల్ స్కామ్ వలన డబ్బులు నష్టపోయిన వారిలో ఎక్కువ మంది (23 శాతం) టైర్ 2 సిటీల నుంచే ఉన్నారంది.
రిపోర్ట్ చేయట్లే
ఆన్లైన్స్ స్కామ్స్పై సైబర్ క్రైమ్ సెల్స్కు డైరెక్ట్గా లేదా ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్చు. కానీ, చాలా మంది బాధితులు రిపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. యూగవ్ సర్వేలో పాల్గొన్న వారిలో 59 శాతం మంది ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఫిర్యాదులు చేసిన వారిలో కూడా 48 శాతం మంది తమ డబ్బులను రికవరీ చేసుకోగా, 46 శాతం మంది మాత్రం నష్టపోయిన డబ్బులు తిరిగి రాలేదని అన్నారు. స్కామర్ల బారిన పడకుండా ఉండడానికి రెస్పాండెంట్లు జాగ్రత్త వహిస్తున్నారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ను ఎవరితోనూ పంచుకోకూడదని 65 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. 59 శాతం మంది మాత్రం అనుమానిత కాల్స్, మెసేజ్లు, ఈ–మెయిల్స్ను బ్లాక్ చేసేయాలని చెప్పారు. అనధికారిక వెబ్సైట్ల నుంచి సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోవద్దని 57 శాతం మంది అన్నారు. పర్సనల్గా కలవని, తెలియని వారికి మనీ ట్రాన్స్ఫర్ చేయొద్దని 47 శాతం మంది అన్నారు. దేశంలో ఇంటర్నెట్ వాడకం వేగంగా పెరుగుతుండడంతో ఆన్లైన్ స్కామ్స్ కూడా పెరుగుతున్నాయని యూగవ్ సర్వే పేర్కొంది.
మరిన్ని విషయాలు..
పట్టణాల్లో ఉంటున్న వారిని స్కామర్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. యూగవ్ రిపోర్ట్ ప్రకారం, స్పామ్, స్కామ్ మెసేజ్లను ప్రతీ రోజు అందుకుంటున్నామని 30 శాతం మంది, వారానికొకసారి అందుకుంటున్నామని 24 శాతం మంది చెప్పారు. 12 శాతం మంది మాత్రం నెలకొకసారి, 14 శాతం మంది కొన్ని నెలలకొకసారి అందుకుంటున్నారు. 6 శాతం మంది మాత్రం తమకు ఎటువంటి స్కామ్, స్పామ్ మెసేజ్లు రాలేదని చెప్పారు. 8 శాతం మంది తమకు తెలియదని సమాధానమిచ్చారు. కాగా, మోసం చేసి డబ్బులు కాజేయడం లేదా పర్సనల్ ఇన్ఫర్మేషన్ పొందడాన్ని స్కామ్గా పరిగణిస్తున్నారు. స్కామ్లతో డబ్బులు పోగొట్టుకునే వారే ఎక్కువ మంది ఉన్నారు. తాను మోసానికి గురయ్యానని 20 శాతం మంది, తనకు తెలిసిన వ్యక్తి మోసపోయారని 47 శాతం మంది చెప్పారు. స్కామ్ వలన డబ్బులు నష్టపోలేదని 28 శాతం మంది, తెలియదని 10 శాతం మంది పేర్కొన్నారు.