
వచ్చే ఏడాది 7.73 శాతం పెరుగుతుంది
టాప్ సప్లయర్గా రష్యా కొనసాగుతుంది: ఒపెక్ రిపోర్ట్
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ వాడకం చాలా వేగంగా పెరుగుతుందని ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) ఓ రిపోర్ట్లో పేర్కొంది. వచ్చే ఏడాది దేశంలో పెట్రోలియం ప్రొడక్ట్ల వాడకం 7.73 శాతం పెరుగుతుందని అంచనావేసింది. మిగిలిన దేశాలతో పోలిస్తే దేశంలో పెట్రోల్, డీజిల్ వాడకం వేగంగా పెరుగుతోందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో రోజుకి 47.7 లక్షల బ్యారెల్స్ ఆయిల్ అవసరమవుతోంది. ఈ నెంబర్ వచ్చే ఏడాదికి 51.4 లక్షల బ్యారెల్స్కు పెరుగుతుందని మంత్లీ ఆయిల్ రిపోర్ట్లో ఒపెక్ వివరించింది. చైనాలో ఇదే టైమ్లో ఆయిల్ డిమాండ్ 1.23 శాతం పెరుగుతుందని, యూఎస్లో 3.39 శాతం, యూరప్లో 4.62 శాతం పెరుగుతుందని లెక్కించింది. దేశంలో ఆయిల్ డిమాండ్ 5.38 శాతం పెరుగుతుందని అంచనా వేసింది.
ఆయిల్ వాడకంలో, దిగుమతుల్లో మనది మూడో అతిపెద్ద దేశం. మనకంటే ముందు యూఎస్, చైనా ఉన్నాయి. ఎకానమీ సగటున 7.1 శాతం చొప్పున వృద్ధి చెందుతుండడంతో దేశంలో ఆయిల్ వాడకం కూడా పెరుగుతుందని అంచనా. దేశ ఆయిల్ దిగుమతులు ఈ ఏడాది జూన్లో సగటున రోజుకి 47 లక్షల బ్యారెల్స్కు పెరిగింది. రష్యా నుంచి దిగుమతయ్యే ఆయిల్ 0.9 శాతం పెరిగింది. ‘కెప్లర్ డేటా ప్రకారం, ఇండియాకు క్రూడాయిల్ సప్లయ్ చేస్తున్న టాప్ దేశంగా రష్యా నిలిచింది. ఇండియా ఆయిల్ దిగుమతుల్లో 24 శాతం వాటా ఈ దేశం నుంచే ఉంది. ఇరాక్ వాటా 21 శాతానికి తగ్గగా, ఈ దేశం రెండో ప్లేస్కి పడిపోయింది. 15 శాతం వాటాతో తర్వాత ప్లేస్లో సౌదీ అరేబియా ఉంది’ అని ఓపెక్ రిపోర్ట్ వెల్లడించింది.