
న్యూఢిల్లీ: ఏఐ టెక్నాలజీ కంపెనీ ఓపెన్ఏఐ ఈ ఏడాది ఢిల్లీలో ఆఫీసును ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. భారతదేశం చాట్జీపీటీకి అమెరికా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్. విద్యార్థులు, నిపుణులు, డెవలపర్లు, వ్యాపారవేత్తలు తమ సమస్యల పరిష్కారానికి ఓపెన్ఏఐ టూల్స్ను వినియోగిస్తున్నారని పేర్కొంది.
భారతదేశంలో ఏఐకి అపారమైన అవకాశాలు ఉన్నాయని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ అన్నారు. ఇక్కడి ఏఐ డెవలపర్లకు అద్భుతమైన టెక్ నైపుణ్యం ఉందని, ప్రభుత్వం కూడా 'ఇండియాఏఐ' మిషన్ ద్వారా వారిని ప్రోత్సహిస్తోందని ప్రశంసించారు. తమ ఆఫీసు ఏఐని అందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుందని పేర్కొంది.