- గెహ్లాటే ఉండాలె.. ఆయన చెప్పినోళ్లన్న కావాలె
- కాదంటే రాజీనామాలేనని హైకమాండ్కు అల్టిమేటం
- స్పీకర్ ఇంటికి 92 మంది ఎమ్మెల్యేలు.. అర్ధరాత్రి హైడ్రామా
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొంది. సీఎం గెహ్లాట్ను అదే పదవిలో కొనసాగించాలని పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా సీఎంగా కొనసాగాలని అంటున్నారు. లేదంటే ఆయన సూచించిన వారినే తర్వాతి సీఎంగా ఎంపిక చేయాలని పట్టుబడుతున్నారు. డిప్యూటీ సీఎం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ను సీఎంను చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైలట్ వైపే హైకమాండ్ మొగ్గుచూపితే తామంతా రాజీనామా చేస్తామని 92 మంది ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ఈమేరకు ఆదివారం రాత్రి రాజీనామా లేఖలతో స్పీకర్ సీపీ జోషి ఇంటికి చేరుకున్నారు. అంతకుముందు మంత్రి శాంతి ధరివాల్ ఇంట్లో అశోక్ గెహ్లాట్ వర్గంలోని 92 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. 2020లో పైలెట్ తిరుగుబాటు అంశంపై చర్చించారు. ఆ సమయంలో గవర్నమెంట్కు మద్దతు ఇచ్చిన వారి నుంచి ఒకరికి సీఎం పదవి ఇవ్వాలని తీర్మానం చేశారు.
మా సీఎం గెహ్లాటే.. ఖచరియావాస్
ఎమ్మెల్యేల అభిప్రాయాలను గెహ్లాట్ పరిగణలోకి తీసుకోవాలని పార్టీనేత ప్రతాప్సింగ్ ఖచరియావాస్ తేల్చిచెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలన్నది 92 మంది ఎమ్మెల్యేల అభిప్రాయమని వివరించారు. తమతో మాటమాత్రమైనా చెప్పకుండా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీకి గెహ్లాట్ ఎలా రెడీ అయ్యారని నిలదీశారు.
హైకమాండ్ నిర్ణయమే ఫైనల్: మంత్రి సుభాశ్
హైకమాండ్ నిర్ణయమే పార్టీలో ఫైనల్ అని మంత్రి సుభాశ్ గార్గ్ స్పష్టం చేశారు. ఆ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. అయితే, రెండేండ్ల క్రితం పార్టీని చీల్చి, గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సచిన్ పైలట్ ప్రయత్నించిన విషయాన్ని మరవొద్దన్నారు. అందుకే ఇప్పుడు సీఎం సీటు ఖాళీ అయితే పార్టీకి నమ్మకస్తుడినే కూర్చోబెట్టాలని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలకు విలువిస్తూ, వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఉన్న నాయకుడినే ఎంపిక చేయాలని హైకమాండ్కు విజ్ఞప్తి చేశారు.
గెహ్లాట్ ఇంట్లో సీఎల్పీ భేటీ
సీఎం అభ్యర్థి ఎన్నికపై చర్చించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ ఇంట్లో ఆదివారం రాత్రి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) భేటీకి నిర్ణయించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ను స్టేట్ ఇన్చార్జ్గా, మల్లికార్జున్ ఖర్గేను అబ్జర్వర్గా సోనియా గాంధీ నియమించారు. వీరు కూడా సీఎల్పీ భేటీకి జైపూర్ చేరుకున్నారు. గెహ్లాట్ ఇంటికి సచిన్ పైలెట్తో పాటు మాకెన్, ఖర్గే చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామా లేఖలు తీసుకొని స్పీకర్ సీపీ జోషి ఇంటికెళ్లడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
నా చేతుల్లో ఏమీ లేదు: గెహ్లాట్
ఎమ్మెల్యేలంతా కోపంగా ఉన్నారని సీఎం అశోక్ గెహ్లాట్పేర్కొన్నారు. తర్వాతి సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో బాగా పట్టుదలగా ఉన్నారని గెహ్లాట్ చెప్పారు. ఈ విషయంలో వాళ్లు ఎవరిమాటా వినేలా లేరని అన్నారు. విషయం తన చేతులు దాటిపోయిందని పార్టీ హైకమాండ్కు గెహ్లాట్ఫోన్లో వివరించారు.