
పహల్గామ్ టెర్రల్ అటాక్ కు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. జమ్మూకాశ్మీర్ లో 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు భారత్ ఎట్టకేలకు బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పీవోకే, పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడి చేసింది. ఈ దాడితో ప్రపంచ దేశాలు మొత్తం ఆపరేషన్ సింధూర్ పై చర్చించుకుంటున్నాయి.
ఆపరేషన్ సింధూర్ పూర్తి వివరాలు
మే 6 న అర్థరాత్రి 1.05 గంటల నుంచి 1.30గంటల వరకు ఆపరేషన్ సింధూర్ జరిగింది.అంటే 25 నిమిషాలు 24 మిసైళ్లతో పీవోకే,పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది భారత్ సైన్యం. పక్కా ఇంటిలిజెన్స్ సమాచారంతో పీవోకే, పాకిస్తాన్ లోని తొమ్మిది టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్ తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. జైషే మొహమ్మద్ (జెఎం), లష్కరే తోయిబా (ఎల్ఇటి), హిజ్బుల్ ముజాహిదీన్లతో సంబంధం ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదులుఈ దాడుల్లో మరణించారని ఉన్నత వర్గాలు తెలిపాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్ లో పోస్టు చేశారు.
ఇండియా దాడిని అటు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ఇండియాకు ఏ క్షణంలోనైనా బుద్ధి చెబుతాం..ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరించింది. మరో వైపు పాకిస్తాన్, ఇండియా దాడులను ప్రపంచం తట్టుకోలేదని ఐక్యరాజ్యసమితి తెలిపింది. సంయమనంతో ఇరు దేశాలు సామరస్యంగా చర్చించుకోవాలని సూచించింది.
సింధూర్ పేరు ఎందుకు.?
జమ్మూకశ్మీర్ లో ఇటీవల జరిగిన పహల్గామ్ టెర్రర్ అటాక్ లో కొత్తగా పెళ్లైన నవ వధువరూలు కూడా ఉన్నారు. నేవీ అధికారి వినయ్ ను టెర్రరిస్ట్ హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మృతదేహం దగ్గర అతడి భార్య ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. టెర్రర్ అటాక్ లో హిందూత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మతం అడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందూత్వ ప్రతీకారంగా, మహిళల సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది.