శత్రువు ఇంట్లోకెళ్లి దాడి చేశాం.. బ్రహ్మోస్ దెబ్బకు పాక్ ఆర్మీకి నిద్రలేని రాత్రులు:మోడీ

శత్రువు ఇంట్లోకెళ్లి దాడి చేశాం.. బ్రహ్మోస్ దెబ్బకు పాక్ ఆర్మీకి నిద్రలేని రాత్రులు:మోడీ

లక్నో: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. శుక్రవారం (మే 30) ప్రధాని మోడీ యూపీలోని కాన్పూర్‎లో పర్యటించారు. దాదాపు రూ.50,000 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత్‎పై జరిగే ప్రతి ఉగ్రదాడికి అదే రేంజ్‎లో ప్రతీకారం ఉంటుందని.. పాక్‌ అణు బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.

ఎప్పుడు దాడి చేయాలో సైన్యమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. -పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను వందల మైళ్ల దూరం లోపలికి వెళ్లి భారత సైన్యం ధ్వంసం చేసిందని.. బ్రహ్మోస్ క్షిపణి శత్రువు ఇంట్లోకెళ్లి సత్తా చాటిందని అన్నారు. మన సాయుధ దళాల వీరోచిత పోరాటానికి భయపడ్డ పాక్ యుద్ధాన్ని ఆపమని వేడుకుందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ భారతదేశ సైనిక శక్తి ఏంటో ప్రపంచానికి చూపించిందన్నారు. 

►ALSO READ | ఒకే నెలలో తొమ్మిది భూకంపాలు:పాకిస్తాన్లో ఏం జరుగుతోంది?

భారత బ్రహ్మోస్ మిస్సైల్ పాక్ సైన్యానికి నిద్ర లేని రాత్రులను మిగిల్చిందన్నారు. ఇస్లామాబాద్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంతో పాటు కాశ్మీర్‌లో చట్టవిరుద్ధంగా ఆక్రమించబడిన ప్రాంతాలను ఖాళీ చేస్తేనే ఆ దేశంతో చర్చల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ యాక్టివ్‎గానే ఉందని.. పాక్ మళ్లీ ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే  భారత సైన్యం ఆ దేశం ఊహించని విధంగా ప్రతిస్పందిస్తుందని దాయాది దేశానికి వార్నింగ్ ఇచ్చారు.