హైదరాబాద్, వెలుగు: యూఎస్ గ్రేట్ రిజిగ్నేషన్ ఇష్యూతో మన దేశంలోని ఐటీ కంపెనీలకు అవకాశాలు పెరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం యూఎస్లో లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం, పని ఒత్తిడి, పనిగంటల పెరుగుదల వంటి కారణాలతో బర్నవుట్ అయిపోయి రాజీనామాల బాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో యూఎస్ ప్రాజెక్ట్లు ఇండియాలోని ఐటీ కంపెనీలకు దక్కుతున్నాయి. ప్రాజెక్ట్ లు పెరగడంతో సీనియర్ ఉద్యోగులను హైర్ చేసుకోవడానికి ఐటీ కంపెనీలు పరుగులు తీస్తున్నాయి. భారీగా శాలరీని ఆఫర్ చేస్తున్నాయి. సీనియర్ ఎంప్లాయిస్ వేరే కంపెనీలకు షిఫ్ట్ అవుతుండటంతో కొత్త వాళ్లనూ, జూనియర్లనూ తీసుకోవడం మొదలుపెట్టాయి కంపెనీలు.
సీనియర్ల రిజిగ్నేషన్ తో..
ప్రస్తుతం యూఎస్ నుంచి ప్రాజెక్ట్లు వస్తుండటంతో శాలరీ ఎంతైనా ఇచ్చి సీనియర్లను తీసుకునేందుకు చూస్తున్నాయి ఐటీ కంపెనీలు. ప్రస్తుతం ఇన్ఫోసిస్, ఒరాకిల్, టీసీఎస్, డెలాయిట్ వంటి కంపెనీలు అమెరికాలో ఇష్యూ వల్ల ఇక్కడ ఆపరేషన్స్ పెంచుకున్నాయి. ప్రాజెక్ట్లను ఇన్టైంలో కంప్లీట్ చేసేందుకు ఇతర కంపెనీలలోని సీనియర్ క్యాడర్ లో ఉన్న టీం లీడర్లను, మేనేజర్లను తీసుకునేందుకు వారికి డబుల్ శాలరీని, హైక్లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అధిక జీతాలతో వేరే కంపెనీల బాట పడుతున్నారు. అమెజాన్ లాంటి కంపెనీలో 53 % మంది ఉద్యోగులు హైక్ ల కారణంగా ఇతర ఆఫీస్లకు షిఫ్ట్ అయ్యారని ఐటీ అండ్ ఎంట్రపెన్యూరర్ ఫోరం ఫౌండర్ శ్రీధర్ మెరుగు తెలిపారు.
ఎంట్రీ లెవల్ నుంచే..
హైక్ లతో సీనియర్లు రిజైన్ చేసి వెళ్లిపోవడం, మరోవైపు ప్రాజెక్ట్లను ఇన్ టైంలో కంప్లీట్ చేయాలనే ఒత్తిడి ఉండటంతో కొత్త వాళ్లను అధికంగా రిక్రూట్ చేసుకుంటున్నాయి కంపెనీలు. ప్రాజెక్ట్లకు బ్యాక్ ఎండ్ టీమ్, డెవలపర్స్, డిజైనర్లు, సపోర్ట్ టీం ఇలా దశలవారీగా మ్యాన్ పవర్ అవసరం పడుతుంది. దీంతో కంపెనీలు రిక్రూట్మెంట్లను పెంచాయి. రీసెంట్ గా ఇంజనీరింగ్ కోర్స్లు పాస్డవుట్ అయిన స్టూడెంట్స్ని, తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగులను కూడా తీసుకోవడం మొదలుపెట్టాయి.
ఒకప్పుడు కంపెనీలలో రిక్రూట్మెంట్ ఏడాదిలో ఒకసారి జరిగేది. అది కూడా అవసరాన్ని బట్టి ఐదారువందల మందిని తీసుకునేవారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న వేకెన్సీలతో మేనేజ్మెంట్ల నుంచి హెచ్ఆర్లకు ప్రెజర్ పెరుగుతోంది. దీంతో కాలేజ్ క్యాంపస్లలో ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడం పెరుగుతోంది. విప్రో, డెలాయిట్ వంటి ఎంఎన్సీలతో పాటు ఇతర చిన్న కంపెనీలలో సైతం 30% రిక్రూట్మెంట్ పెరిగింది. గతంలోలా ఏడాదికి ఒక్కసారి కాకుండా ఇప్పుడు క్వార్టర్ క్వార్టర్కు కంపెనీలు హైరింగ్ చేపడుతున్నాయి. ఇందులో జూనియర్ లెవల్ (ఫ్రెషర్), మిడిల్ లెవల్, సీనియర్ లెవల్స్ కోసం నియమకాలు చేపడుతున్నాయి. ప్రాజెక్ట్స్ రావడంతో వేకెన్సీలు పెరుగుతున్నాయి. దీంతో క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా కంపెనీలు వందల్లో ఉద్యోగులను తీసుకుంటున్నాయి. సీనియర్లను 100 శాతం శాలరీ హైక్ తో జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఫ్రెషర్స్ను కూడా కంపెనీలు భారీగా నియమించుకుంటున్నాయి.
- సత్యనారాయణ మథాలా
(ప్రెసిడెంట్, టీఎఫ్ఎంసీ)