బిజినెస్డెస్క్, వెలుగు: ఇంటర్నేషనల్ మార్కెట్లో షుగర్ కొరత నెలకొంది. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో షుగర్ ధరలు ఏకంగా 20 శాతం ఎగిశాయి. ఈ పరిస్థితులు దేశ షుగర్ ఎక్స్పోర్ట్స్కు లాభం చేకూరుస్తాయని నిపుణులు అంచనావేస్తున్నారు. గ్లోబల్గా ఎక్కువగా షుగర్ను ఎగుమతి చేసే బ్రెజిల్లో వాతావరణ పరిస్థితులు బాగాలేవు. దీంతో అక్కడ ముందటి ఏడాది కంటే 70–80 లక్షల టన్నుల ప్రొడక్షన్ తగ్గుతుందని అంచనా. షుగర్ను ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే థాయ్ల్యాండ్లో కూడా సాధారణ ప్రొడక్షన్ కంటే 70–80 లక్షల టన్నుల షుగర్ తగ్గుతుందని తెలిసింది. ఈ పరిస్థితులు ఇండియాకు లాభాన్ని చేకూరుస్తాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద షుగర్ ఎగుమతి దేశంగా ఇండియా ఉంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు మనకు లాభాన్నిస్తాయి. కానీ , ప్రభుత్వం ఈ పరిస్థితులను వాడుకోవాలని, ఎక్స్పోర్ట్ చేసే షుగర్ లిమిట్ను పెంచాలని షుగర్ ఇండస్ట్రీ చెబుతోంది. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల టన్నులకు పైగా షుగర్ను లోకల్ షుగర్ మిల్లులు ట్రేడ్ చేశాయని ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాహిల్ సైఖ్ అన్నారు. ఇందులో 40 లక్షల టన్నుల షుగర్ను ఇప్పటికే రవాణా చేశాయని చెప్పారు. 2020–21 సీజన్(అక్టోబర్–సెప్టెంబర్) టార్గెట్ 60 లక్షల టన్నులను డెడ్లైన్ కంటే ముందే చేరుకుంటామని పేర్కొన్నారు. పౌండు ఘగర్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో రూ. 14 దాటితే ఓపెన్ జనరల్ లైసెన్స్(ఓజీఎల్) ఎక్స్పోర్ట్స్ ద్వారా ఎగుమతి చేయడానికి చూడాలని షుగర్ ఎక్స్పోర్టర్లకు ఆయన సలహాయిచ్చారు. ఇండియాలో షుగరు మిగులు ఉందని అన్నారు. కాగా, దేశంలో వైట్ షుగర్ ధర ఏప్రిల్ 1 న క్వింటాకు రూ. 2,600 ఉండగా, ప్రస్తుతం ఈ రేటు రూ. 2,750 క్రాస్ చేసింది. ఇదే టైమ్లో రా షుగర్ ధర క్వింటాకు రూ. 2,550 నుంచి రూ. 2,700 కు పెరిగింది.
ప్రొడక్షన్ తగ్గుతుతోంది..
గ్లోబల్ షుగర్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని దేశ షుగర్ ఎగుమతుల కోటాను పెంచాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్(ఎన్ఎఫ్సీఎస్ఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ‘క్రూడాయిల్ ధరలు పెరుగుతుండడంతో ఇథనాల్ తయారీపై బ్రెజిల్ దృష్టిపెడుతోంది. దీని కోసం షుగర్కేన్(చెరుకు)లను ఎక్కువగా కేటాయిస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో షుగర్ ధరలు పెరగడానికి ఇదొక కారణమవుతుంది’ అని ఎన్ఎఫ్సీఎస్ఎఫ్ ఎండీ ప్రకాశ్ నైకన్వేర్ అన్నారు. దేశ షుగర్ సీజన్(అక్టోబర్–సెప్టెంబర్) ముగింపుకొచ్చిందని చెప్పారు. థాయ్ల్యాండ్ షుగర్ ప్రొడక్షన్ కూడా తగ్గిందని, ఇది ఇండియాకు లాభం చేకూరుస్తుందని పేర్కొన్నారు. నేలలో తేమ తగ్గిపోవడంతో బ్రెజిల్లో షుగర్ కేన్ ప్రొడక్షన్ పడిపోతుందని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు అంచనావేస్తున్నాయి. ఈ దేశంలో కరువు కొనసాగుతుండడంతో ఈ సీజన్లో 5.3 కోట్ల టన్నుల వరకు షుగర్ ప్రొడక్షన్ తగ్గుతుందని విల్మర్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇది కిందటేడాదితో పోలిస్తే 12 శాతం తక్కువని తెలిపింది. బ్రెజిల్లో ఈ సీజన్ ప్రొడక్షన్ గత పదేళ్లలో తక్కువగా నమోదవుతుందని అభిప్రాయపడింది. మరోవైపు ఫ్రాన్స్లో బీట్రూట్ దిగుబడి కూడా పడిపోతుందని అంచనా. యురొపియన్ యూనియన్ దేశాలలో ఈ దేశంలో షుగర్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతోంది. ఫ్రాన్స్లో బీట్ ప్రొడక్షన్ 10 శాతం వరకు పడిపోతుందని, దీంతో షుగర్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుందని సీజీబీ పేర్కొంది.
త్వరలోనే టార్గెట్ చేరుకుంటాం
2020–21 సీజన్లో 56 లక్షల టన్నుల షుగర్ను ఎగుమతి చేసేందుకు కాంట్రాక్ట్స్ వచ్చాయని ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్(ఏఐఎస్టీఏ) ప్రకటించింది. కోటాలోని మిగిలిన రూ. నాలుగు లక్షల టన్నులను కూడా త్వరలోనే చేరుకుంటామని తెలిపింది. 2020–21 సీజన్(అక్టోబర్–సెప్టెంబర్) లో మిగులు షుగర్లో 60 లక్షల టన్నుల వరకు మాత్రమే ఎక్స్పోర్ట్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2019–20 సీజన్లో 59 లక్షల టన్నులను ఎగుమతి చేయగలిగాం. ఇప్పటి వరకు 56 లక్షల టన్నుల షుగర్ను ఎగుమతి చేసేందుకు కాంట్రాక్ట్స్ వచ్చాయని, ఇందులో 34.78 లక్షల టన్నుల షుగర్ను 12 దేశాలకు ఎగుమతి చేశామని ఏఐఎస్టీఏ పేర్కొంది. మొత్తం ఎగుమతుల్లో 35 శాతం వరకు ఇండోనేషియాకు ఎక్స్పోర్ట్ చేశామని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ దేశానికి 12.17 లక్షల టన్నులను, ఆప్ఘానిస్తాన్కు 4.33 లక్షల టన్నులను, యూఏఈకి 3.66 లక్షల టన్నులను ఎగుమతి చేయగలిగామని తెలిపింది. మరో 4.54 లక్షల టన్నుల షుగర్ పోర్ట్లకు బయలుదేరిందని, ఇంకో 4.43 లక్షల టన్నుల షుగర్ లోడింగ్ అవుతోందని ఏఐఎస్టీఏ తెలిపింది. దీంతో ఎక్స్పోర్ట్ల కోసం 43.76 లక్షల టన్నుల షుగర్, మిల్లుల నుంచి రవాణా అయ్యిందని పేర్కొంది. కంటైనర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, రవాణా ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.