ముంబై : ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించ డానికి బీజేపీకి ఒక్కరే దిక్కని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే అన్నారు. ఈ విషయంలో ఇండియా కూటమికి చాలా చాయిస్ లు ఉన్నాయని వెల్లడించారు. బుధవారం ఆయన గ్రాండ్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.“గత తొమ్మిదేండ్లుగా బీజేపీ ఒక్కరిని మాత్రమే ప్రధానమంత్రి పదవికి ఎంపిక చేస్తున్నది. వాళ్లకు ఇంకో చాన్స్ లేనే లేదు. కానీ ఇండియా కూటమిలో ఈ పదవికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
ఈ "రక్షా బంధన్" కానుకగా సిలిండర్ ధరను రూ.200 తగ్గిస్తమంటున్నారు. గత తొమ్మిదేండ్లుగా రక్షా బంధన్ జరగలేదా .? తొమ్మిదేండ్లుగా ఏం చేస్తున్నారు. ఇండియా కూటమి మరింత బలపడితే సిలిండర్లు ఫ్రీగా కూడా ఇస్తారు. ప్రజలు తెలివైనవారు. ప్రతిదీ అర్థం చేసుకుంటారు” అని ఠాక్రే వివరించారు. ఇండియా కూటమికి కన్వీనర్ను నియమిస్తారా లేదా అని విలేకరులు ప్రశ్నించగా.. దాని కోసం సమావేశం నిర్వహించాల్సి ఉందని థాక్రే బదులిచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) కన్వీనర్ ఎవరో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు.