న్యూఢిల్లీ: కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని, మోడీ మరోసారి ప్రధాని అవుతారంటూ పలు సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్లో వాస్తవం ఎంత ఉంది? వాటి అంచనాలను నమ్మడానికి వీలులేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ సారి సర్వే సంస్థలు పూర్తిగా రాంగ్ రిజల్ట్స్ ఇచ్చాయని వాదిస్తున్నాయి. తమ ఐక్యతను దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదని మండిపడుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లో ఆరునెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని, అక్కడ కూడా ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారంటేనే ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత ఏమిటో అర్థమవుతుందంటున్నాయి.
అమెరికాలో, ఆస్ట్రేలియాలో తారుమారు
2016లో జరిగిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎగ్జిట్పోల్స్ తారుమారయ్యాయి. డెమోక్రటిక్ పార్లీ లీడర్ హిల్లరీ క్లింటన్ ప్రెసిడెంట్ అవుతారని దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి. కానీ.. అసలు రిజల్ట్స్వచ్చేసరికి రిపబ్లికన్ పార్టీ లీడర్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇక, ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అక్కడ ప్రతిపక్ష లేబర్ పార్టీ విజయం సాధిస్తుందని దాదాపు 56 ఎగ్జిట్పోల్స్ అంచనా వేశాయి. కానీ అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది.
సైలెంట్ ఓటును పట్టుకోలేని సంస్థలు!
అమెరికాలో, ఆస్ట్రేలియాలో సర్వే సంస్థలు సైలెంట్ ఓటును కనిపెట్టలేకపోయాయని, అందుకే అవి అక్కడ ఫెయిల్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మన దగ్గర చాలా మంది ఓటర్లు తాము ఎవరికి ఓటేశామన్నది చెప్పడానికి ఇష్టపడరని వారు చెప్తున్నారు. ప్రతిపక్షాలన్నీ ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక్కటైన ప్రస్తుత సమయంలో ఏకపక్షంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావడం నమ్మలేకపోతున్నామంటున్నారు. ఐదేళ్ల ఎన్డీయే ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కనిపించిందని, అది సైలెంట్ ఓటుగా పడిందని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ రాగానే.. దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు కొట్టిపారేశాయి. ఈవీఎంలను తారుమారుచేసే కుట్రలో భాగంగానే ఎగ్జిట్ పోల్స్ను ఎన్డీయేకు అనుకూలంగా ఇచ్చారని టీఎంసీ చీఫ్ మమత ఫైర్ అయ్యారు. మన దేశంలో ఎగ్జిట్ పోల్స్ చాలా సందర్భాల్లో నిజమయ్యాయని, ఒకవేళ ఈ సారి మాత్రం అవి రాంగైతే సర్వే సంస్థలు విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉందని సర్వే రంగ నిపుణులు అంటున్నారు.