- డబ్ల్యూహెచ్వో వెబ్సైట్లో ఓయూ ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్ వ్యాసం
- కరోనాపై డబ్ల్యూహెచ్వో పబ్లిష్ చేసిన దేశంలోనే తొలి వ్యాసంగా గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్ షెఫర్డ్ బీనవేణికి అరుదైన గౌరవం దక్కింది. కరోనా నివారణ, నియంత్రణకు సంప్రదాయ వైద్యమే మేలని ఆయన రాసిన వ్యాసాన్ని డబ్ల్యూహెచ్వో లిస్ట్ చేసింది. దేశం నుంచి ఇప్పటిదాకా కరోనా ట్రీట్మెంట్పై రాసిన ఏ జర్నల్కూ డబ్ల్యూహెచ్వోలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఓయూ సోషియాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన.. ‘ఇండియాస్ ఇండిజీనస్ ఐడియా ఆఫ్ హెర్డ్ ఇమ్యూనిటీ: ది సొల్యూషన్స్ ఫర్ కొవిడ్ 19’ అనే టైటిల్తో హెర్డ్ ఇమ్యూనిటీపై వ్యాసం రాశారు. అనాది నుంచి దేశంలో వైరస్లు, అంటువ్యాధుల నివారణ కోసం ఎన్నెన్నో పద్ధతులు వాడేవారని అందులో పేర్కొన్నారు. సంప్రదాయ ట్రీట్మెంట్ పద్ధతుల్లో ఇనాక్యులేషన్, వైరలేషన్ పద్ధతుల ద్వారా జబ్బులను నివారించగలిగారని గుర్తు చేశారు. మశూచి, చికెన్ పాక్స్ లాంటి వైరల్ జబ్బుల నివారణను ప్రస్తావించారు. వైరస్ సోకిన వ్యక్తులు లేదా జంతువుల నుంచి ప్లాస్మా, సీరమ్ను తీసి వైరస్ను సేకరించేవారని, దానిని అమ్మతల్లి చెట్లు ఆకుపసరులో కలపి వైరస్ తీవ్రతను తగ్గించారని గుర్తు చేశారు. ఇలాంటి ట్రీట్మెంట్ సింధూనాగరికత నుంచే ఉన్నాయని, గ్రామదేవతలుగా పూజించే పోచమ్మ, ముత్యాలమ్మ లాంటి వాళ్లు ఆ ట్రీట్మెంట్లను చేశారని పేర్కొన్నారు. ఆయన వ్యాసాన్ని చైనాకు చెందిన కేన్సర్ అసోసియేషన్ ప్రచురించే ట్రెడిషనల్ మెడిసిన్ రీసెర్చ్ అనే ఇంటర్నేషనల్ జర్నల్ జూన్లో పబ్లిష్ చేసింది.
సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించాలి
దేశంలో సంప్రదాయ వైద్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. పరిశోధకులకు వసతులు, గ్రాంట్స్ ఇవ్వాలి. విదేశీ దండయాత్రలు, ఆధిపత్య సంస్కృతి వల్ల సరైన పరిశోధనలు జరగలేదు. ప్రభుత్వాలు ఇకనైనా దృష్టిపెడితే వైద్యరంగంలో మరింత ముందుకు వెళ్తాం.
– ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్