మాస్కో: ‘‘మాతృభూమి ఎప్పుడైనా పవిత్రమైనదే. దానిని కాపాడుకోవడం కోసమే ఇప్పుడు మేం పోరాటం చేస్తున్నాం. ఉక్రెయిన్లో మా బలగాలు పోరాడుతున్నది మా దేశ భవిష్యత్తు గురించే” అని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై రష్యా గెలుపును పురస్కరించుకుని నిర్వహించిన విక్టరీ డే పరేడ్లో పుతిన్ మాట్లాడారు. అయితే 1945 విజయాన్ని ఉక్రెయిన్ యుద్ధంతో ముడిపెట్టి మాట్లాడారు. తమ భద్రతకు సంబంధించిన డిమాండ్లను నాటో, వెస్ట్రన్ కంట్రీస్ పటించుకోలేదని, రష్యా మాటలను వినాలని వారు అసలు భావించడంలేదని విమర్శించారు. తమ భూభాగంలోకి చొరబడేందుకు అవి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. తమ బార్డర్ల దగ్గర నాటో ఉద్రిక్తతలు పెంచుతోందని ఆరోపించారు. విక్టరీ డే స్పీచ్లో ఉక్రెయిన్కు సంబంధించి పుతిన్ కీలక ప్రకటన చేస్తారని భావించినా.. అలాంటిదేమీ లేకుండానే ఆయన ప్రసంగం ముగిసింది. వ్యూహాన్ని మార్చి ఉక్రెయిన్పై పూర్తి యుద్ధాన్ని ప్రకటిస్తారని, లేదా సైనిక బలగాలను బలోపేతం చేసేలా రష్యా ప్రజలకు పిలుపునిస్తారని ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఉక్రెయిన్లో చనిపోయిన, గాయపడిన తమ సైనికుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆదుకునేందుకు ఉద్దేశించిన ప్రత్యేక డిక్రీపై ఆయన సంతకం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమరులతో పాటు ఉక్రెయిన్లో చనిపోయిన వారికి నిమిషం పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. పరేడ్లో 11 వేల ట్రూప్స్, 131 యుద్ధ వాహనాలు పాలుపంచుకున్నాయి. 11 నిమిషాల పాటు పుతిన్ ప్రసంగం సాగింది. అయితే పుతిన్ ఆరోపణలను ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ అధికారి మిఖైలో పొడోలియాక్ ఖండించారు. యుద్ధానికి అవకాశమే లేదని, రష్యాపై దాడి చేయాలని నాటో దేశాలు భావించడంలేదని ట్విట్టర్లో పేర్కొన్నారు.
పోలెండ్లో రష్యా అంబాసిడర్పై పెయింట్తో దాడి
రష్యన్ అంబాసిడర్కు పోలెండ్ లో చేదు అనుభవం ఎదురైంది. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన రెడ్ ఆర్మీ సైనికులకు నివాళులర్పించేందుకు రష్యా అంబాసిడర్ సెర్గీ ఆండ్రివ్ సోమవారం పోలెండ్లోని వార్స్వాకు వచ్చారు. అయితే ఉక్రెయిన్కు మద్దతు తెలుపుతూ నిరసనకు దిగిన ఆందోళనకారులు ఆండ్రివ్పై ఎరుపు రంగు పెయింట్తో దాడి చేశారు. తొలుత వెనుక నుంచి పెయింట్ విసిరిన ఆందోళనకారులు ఆ తర్వాత నేరుగా ఆయన ముఖంపైనే పెయింట్ పోశారు. రష్యా సైనికులకు నివాళులర్పించకుండా ఆయన బృందాన్ని అడ్డుకున్నారు.