సంక్రాంతి పండగకు ఆంధ్రాలో కోడిపందాలు ఎంతో ఫేమసో.. తమిళనాడులో జల్లికట్టు అంతా ఫేమస్. జల్లికట్టు అంటే ఎద్దులను మచ్చిక చేసుకునే ఆట. ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 15,16,17 తేదీల్లో పోటీలు జరుగుతాయి.ఈ ఏడాది జల్లికట్టు పోటీలో బరిలో దిగేందుకు 12 వేల ఎద్దులు రెడీ అయిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 15న అవనియాపురంలో, 16న పాలమేడు గ్రామంలో 17న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి మూర్తి తెలిపారు. మూడు జల్లికట్టు ఈవెంట్లలో ఉత్తమ ఎద్దు, ఉత్తమ ఎద్దులను టామర్ ఒక్కొక్కరికి కారు బహుమతి ఉంటుందిని మంత్రి తెలిపారు.
అవనియాపురం జల్లికట్టు కోసం మొత్తం 2,400 ఎద్దులు, 1,318 టామర్లు, పాలమేడు జల్లికట్టు కోసం 3,677 ఎద్దులు, 1,412 టామర్లు, అలంగనల్లూరు కార్యక్రమానికి 6,099 ఎద్దులు, 1,784 టామర్లను దరఖాస్తు చేసుకున్నట్లుగా వెల్లడించారు. 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది. అయితే, ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాట పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలోనే జల్లికట్టును ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టం నుంచి తొలగిస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం 2017లో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుకు అనుకూలంగా ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టానికి సవరణలు చేస్తూ కొత్త యాక్ట్ తీసుకొచ్చింది. జల్లికట్టుపై తమిళనాడు చేసిన చట్టాన్ని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది.