పన్ను చెల్లింపును కొత్త సంస్కరణలు మార్చేస్తాయి

పన్ను చెల్లింపును కొత్త సంస్కరణలు మార్చేస్తాయి

న్యూఢిల్లీ: నిజాయితీగా వ్యవహరిస్తున్న పన్ను చెల్లింపుదారులను గౌరవిస్తూ వారిని ప్రోత్సహించడానికి ప్రధాని మోడీ కొత్త ట్యాక్స్ స్కీమ్‌ను గురువారం లాంచ్ చేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో మోడీ కొత్త పన్ను సంస్కరణల గురించి పలు విషయాలు మాట్లాడారు. దేశంలో పన్ను చెల్లింపు విధానాన్ని కొత్త పన్ను సంస్కరణలు మార్చి వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ట్యాక్స్‌ పేయర్స్‌ను అంచనా వేయడానికి, వారి అప్పీల్‌ను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.

ఫేస్‌లెస్ అప్పీల్ సర్వీస్ సెప్టెంబర్ 25 నుంచి అందుబాటులో ఉంటుందని ప్రధాని తెలిపారు. ఫేస్‌లెస్ టీమ్స్ ఇండియా వ్యాప్తంగా ఐటీ రిటర్న్స్‌ను, ఫిర్యాదులను పరిష్కరింస్తుందని పేర్కొన్నారు. ఈ టీమ్స్‌ను ఏదైనా సిటీ నుంచి ర్యాండమ్‌గా ఎంపిక చేస్తామన్నారు. దేశ నిర్మాణంలో నిజాయితీగా ఉండే ట్యాక్స్ పేయర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని మోడీ మెచ్చుకున్నారు. ‘ఎప్పుడైతే నిజాయితీగా పన్ను కట్టే వారి జీవితం మెరుగ్గా ఉంటుందో అప్పుడే వాళ్లు ముందుకెళ్తారు. తద్వారా దేశం కూడా అభివృద్ధి మార్గంలో వడివడిగా దూసుకెళ్తుంది’ అని మోడీ చెప్పారు. ట్యాక్స్ పేయర్స్‌కు సాధికరత కల్పించడంతోపాటు పారదర్శక విధానాన్ని అమలు చేయాలన్నదే ప్రధాని మోడీ విజన్ అని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.