నేవీ రంగంలోకి దిగుంటే.. పాక్ ఈ సారి 4 ముక్కలయ్యేది: రాజ్ నాథ్ సింగ్ హాట్ కామెంట్స్

నేవీ రంగంలోకి దిగుంటే.. పాక్ ఈ సారి 4 ముక్కలయ్యేది: రాజ్ నాథ్ సింగ్ హాట్ కామెంట్స్

న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్‎కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను శుక్రవారం (మే 30) ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇండియన్ నేవీ ఉన్నతాధికారులతో చర్చించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ తీసుకున్న చర్యలను ప్రశంసించడంతో పాటు.. భారత నావికాదళ సత్తా ఏంటో మరోసారి పాక్‎కు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నావికాదళం తన సోదర దళాలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‎తో కలిసి ఉంటే పాకిస్తాన్ 1971 కంటే దారుణమైన ఫలితాన్ని చవిచూసేదని.. ఈ సారి పాకిస్థాన్ నాలుగు ముక్కలు అయ్యేదని హాట్ కామెంట్స్ చేశారు.

 ‘‘1971 భారత్, పాక్ యుద్ధంలో ఇండియన్ నేవీ దెబ్బకు పాకిస్థాన్ రెండు ముక్కలు (పాక్ నుంచి బంగ్లా విడిపోవడం) అయ్యింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత నావికాదళం రంగంలోకి దిగి ఉంటే.. ఈ సారి పాకిస్తాన్ నాలుగు భాగాలుగా విభజించబడి ఉండేది’’ అని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నావికాదళం తన నిశ్శబ్ద సేవతో ప్రతి భారతీయుడిని ఆకట్టుకుందని ప్రశంసించారు. ఇండియన్ నేవీ యాక్షన్‎లోకి దిగకుండా మౌనంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ సైన్యాన్ని కట్టడి చేయడంలోవిజయం సాధించిందని అన్నారు. ఈ మొత్తం సమగ్ర ఆపరేషన్‌లో నేవీ పాత్ర అద్భుతమైనదని కొనియాడారు. 

Also Read : గాజాలో ఆకలి కేకలు.. కాల్పుల్లో ఇద్దరు

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయగా.. అదే సమయంలో అరేబియా సముద్రంలో భారత నావికాదళ దూకుడైన మోహరింపు, సముద్రంపై సాటిలేని ఆధిపత్యం పాకిస్తాన్ నావికాదళాన్ని పూర్తిగా దాని సొంత తీరాలకే పరిమితం చేశాయని పేర్కొన్నారు. ఇండియన్ నేవీ దెబ్బకు బహిరంగ సముద్రంలోకి రావడానికి కూడా పాక్ ధైర్యం చేయలేకపోయిందన్నారు. సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్, వెస్ట్రన్ ఫ్లీట్ నౌకలు ఉగ్రవాద దాడి జరిగిన 96 గంటల్లోనే పశ్చిమ, తూర్పు తీరం వెంబడి సర్ఫేస్ టూ సర్ఫేస్, సర్ఫేస్ టూ ఎయిర్ క్షిపణులు, టార్పెడోలను విజయవంతంగా ప్రయోగించి.. మన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాయన్నారు. 

తద్వారా శత్రువును రక్షణాత్మక ఒత్తిడిలోకి నెట్టాయన్నారు. ఇండియన్ నేవీ ఒక్క తూటా కూడా పేల్చకుండానే శత్రువుల ధైర్యాన్ని దెబ్బతీసిందన్నారు. గంటల్లోనే భారత నేవీ సంసిద్ధత, సత్తా చూసి పాక్ వణిపోయిందని.. దీంతో నేవీ రంగంలోకి దిగాల్సిన అవసరం రాలేదని పేర్కొన్నారు. ఇండియన్ నేవీ ఈ మిషన్‌లో భాగమైతే పాకిస్తాన్‌కు ఏమి జరిగి ఉండేదో చెప్పనవసరం లేదని.. ఒక విధంగా ఆపరేషన్ సిందూర్‎లోకి భారత నావికాదళం ఎంటర్ కాకపోవడం పాకిస్తాన్ అదృష్టమని సెటైర్ వేశారు. 

అయితే, పాక్ వక్రబుద్ధిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఆ దేశం ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగిన ధీటుగా ఎదుర్కొనేందుకు నేవీ పూర్తిగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మీ సన్నాహాలలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని.. ఇప్పటివరకు జరిగినదంతా కేవలం ఒక వార్మప్ మాత్రమేనన్నారు. పాకిస్తాన్ మళ్ళీ ఏదైనా దాడి చేయడానికి ధైర్యం చేస్తే.. ఈసారి నేవీ కూడా రంగంలోకి దిగుతోందని.. అప్పుడు పాకిస్తాన్‌కు ఎలాంటి గతి పడుతుందో ఆ దేవునికే తెలుసని వార్నింగ్ ఇచ్చారు.