
- రాజస్తాన్లో ఆర్మీకి పట్టుబడ్డ పాక్ ఫైటర్ జెట్ పైలట్
- రాత్రిపూట జమ్మూ, రాజస్తాన్, పంజాబ్, గుజరాత్లో
- సూసైడ్ డ్రోన్లు, మిసైల్స్తో దాడులకు పాక్ యత్నం
- గాల్లోనే తునాతునకలు చేసిన మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
- -మూడు ఫైటర్ జెట్లను కూల్చేసిన సుదర్శన చక్ర
- లాహోర్, సర్గోడా, ఫైసలాబాద్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం
- పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించిన అజిత్ దోవల్
- త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ అత్యవసర భేటీ
- సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా
- ఈయూ దేశాలతో చర్చించిన విదేశాంగ మంత్రి జైశంకర్
- బార్డర్ రాష్ట్రాల్లో బ్లాక్ ఔట్.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
- అధికారులకు సెలవులు రద్దు.. స్కూళ్లు, కాలేజీలు బంద్
న్యూఢిల్లీ: జనావాసాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డ పాకిస్తాన్కు మన దేశం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. గురువారం రాత్రి పాక్ నుంచి డ్రోన్లు, మిసైల్స్, ఫైటర్ జెట్లు దూసుకురాగా.. గాల్లోనే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తునాతునకలు చేసింది. లాహోర్, సర్గోధా, ఫైసలాబాద్ సిటీల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను మన డ్రోన్లు తుక్కుతుక్కు చేశాయి. పాక్ ఫైటర్ పైలట్ను రాజస్తాన్లోని జైసల్మేర్లో మన సైన్యం పట్టుకుంది. పాక్ నేరుగా దాడి చేసినట్లు నిరూపించే సంఘటన ఇది.
శత్రువు చర్యలను తిప్పికొట్టేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ వాళ్లను, అందుకు ప్రోత్సహించిన వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేబోమని హెచ్చరించింది. పరిస్థితిని ప్రధాని నరేంద్రమోదీకి నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్ వివరించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీఆఫీసర్లతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఈయూ దేశాల ప్రతినిధులతో చర్చించారు. ఆయా దేశాల ప్రతినిధులకు ప్రస్తుత పరిస్థితిని జైశంకర్ వివరించారు. సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి అలర్ట్ చేశారు.
శత్రు జెట్లను తుక్కుచేసిన సుదర్శన చక్ర
గురువారం రాత్రి 8 గంటల నుంచి సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకాశ్మీర్, రాజస్తాన్, గుజరాత్, పంజాబ్ పరిసరాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో అటాక్ ప్రారంభించింది. జనావాసాలే టార్గెట్గా ఈ చర్యకు దిగింది. ముందే పసిగట్టిన మన డిఫెన్స్ సిస్టమ్.. జమ్మూ ఎయిర్పోర్ట్సహా అఖ్నూర్, కిష్త్వార్, సాంబా, ఉరి సెక్టార్ పరిసరాల్లో, పంజాబ్లోని అమృత్సర్, గుర్దాస్పూర్, రాజస్తాన్లోని జైసల్మేర్, గుజరాత్లోని కచ్లో బ్లాక్ ఔట్ ప్రకటించింది. ఇందులో భాగంగా విద్యుత్ సరఫరాను అధికారులు ఆపేశారు.
ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని వారు సూచించారు. పాక్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లను, మిసైల్స్ను రెప్పపాటులోనే యాక్టివేట్ అయిన ఎస్ 400 సుదర్శన చక్ర, ఎల్ 70, సూ 23, షిల్కా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్గాల్లోనే తునాతునకలు చేశాయి. జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్గా సూసైడ్ డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించగా.. వాటిని మన ఆర్మీ తిప్పికొట్టింది. పాకిస్తాన్కు చెందిన దాదాపు 30 డ్రోన్లను, ఒక ఎఫ్- 16, రెండు జేఎఫ్- 17 ఫైటర్ జెట్లను సుదర్శన చక్ర నాశనం చేసింది.
హై అలర్ట్
పహల్గాం ఉగ్రదాడికి, పాక్ దుశ్చర్యలకు ప్రతీకారంగా ఇప్పటికే ‘ఆపరేషన్ సిందూర్’ను మన బలగాలు సక్సెస్ ఫుల్గా నిర్వహించాయి. తాము ఉద్రికత్తలను కోరుకోవడం లేదని, పాకిస్తాన్ దాడులకు పాల్పడితే సహించేది లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. గత నెల 22న పహల్గాం దాడి జరగగా.. అప్పటి నుంచి బదులు తీర్చుకునేందుకు ఆర్మీ ప్రిపరేషన్లు మొదలుపెట్టింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్నీ సిద్ధం చేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ‘ఆపరేషన్సిందూర్’ నిర్వహించి.. 100 మంది టెర్రరిస్టులను అంతం చేసింది. అయినా.. పాక్ వంకర బుద్ధి మారలేదు.
బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము మధ్య మన దేశంలోని 15 పట్టణాలపైకి డ్రోన్లతో పాకిస్తాన్ తెగబడగా.. ఎక్కడికక్కడ మన డిఫెన్స్ సిస్టమ్ వాటిని కూల్చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతూనే ఉంటుందని సమావేశంలో రాజ్నాథ్ ప్రకటించారు. బార్డర్ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇదే క్రమంలో గురువారం రాత్రి 8 గంటల నుంచి పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. దాయాది దుశ్చర్యలను ముందే పసిగట్టిన మన సైన్యం బార్డర్ రాష్ట్రాల్లో వార్ సైరన్ మోగించింది. బ్లాక్ ఔట్ను ప్రకటించింది. జమ్మూకాశ్మీర్, రాజస్తాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో విద్యుత్ను నిలిపివేశారు. గాల్లోనే పాక్ డ్రోన్లను, మిసైల్స్ను మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుక్కు చేసింది.
పాక్ డ్రోన్లను నేలమట్టం చేయడమే కాకుండా.. పాకిస్తాన్లోని లాహోర్, సర్గోడా, ఫైసలాబాద్ సిటీల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను మన డ్రోన్లు తుక్కుతుక్కు చేశాయి. బుధవారం అర్ధరాత్రి తర్వాత పాక్ చేసిన డ్రోన్ దాడులకు ప్రతీకారంగా లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను గురువారం మధ్యాహ్నం మన డ్రోన్లు ధ్వంసం చేశాయి. గురువారం రాత్రి పాక్ దాడులకు దిమ్మతిరిగేలా సర్గోడా, ఫైసలాబాద్ సిటీల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా నాశనం చేశాయి.
కరాచీ పోర్ట్పై కూడా అటాక్ చేసి.. సత్తా చాటాయి. పాకిస్తాన్లోని ప్రధాని సిటీలపై ముప్పేటదాడికి సిద్ధమయ్యాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఆయా రాష్ట్రాల్లో అధికారులకు సెలవులను రద్దు చేశారు. అధికారులు ఎవరూ జిల్లా దాటి వెళ్లొద్దని, అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చారు. అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు, కోర్టులకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు. శ్రీనగర్, చండీగఢ్, అమృత్సర్, లూదియానా, పాటియాలా, సిమ్లా సహా 24 ఎయిర్పోర్టులను క్లోజ్ చేశారు.
లాహోర్ ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం
బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు మన దేశంపై దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్కు మన ఆర్మీ దీటుగా బదులిచ్చింది. మన దేశంపైకి వచ్చిన పాక్ మిసైల్స్, డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చివేసింది. పాక్కు రక్షణపరంగా కీలకమైన లాహోర్ సహా పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసి, ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది. అత్యాధునిక హార్పీ డ్రోన్లతో పాక్ గగనతల రక్షణ వ్యవస్థను దెబ్బతీసింది. బార్డర్ రాష్ట్రాల్లోని 15 సిటీల్లో ఉన్న మిలటరీ స్థావరాలే లక్ష్యంగా మిసైల్స్, డ్రోన్లతో పాక్ బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు దాడులకు ప్రయత్నించగా.. వాటిని ఆర్మీ తిప్పికొట్టింది.
సుదర్శన చక్రం లాంటి ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో పాక్ మిసైల్స్, డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చివేసింది. అంతేకాకుండా లాహోర్పై మన ఆర్మీ డ్రోన్ల వర్షం కురిపించింది. పాక్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే లక్ష్యంగా అత్యాధునిక హర్పీ డ్రోన్లతో విరుచుకుపడింది. లాహోర్లోని ఆర్మీ కంటోన్మెంట్ టార్గెట్గా నాలుగుకు పైగా డ్రోన్లను ప్రయోగించింది. మన ఆర్మీ జరిపిన డ్రోన్ దాడులతో లాహోర్ దద్దరిల్లింది. భారీ శబ్దాలకు జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. లాహోర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇండియన్ ఆర్మీ డ్రోన్ దాడులు చేసి, ఆయా ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసింది.
దాడులను తిప్పికొట్టిన ఆర్మీ..
మన దేశంపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం రాత్రి 15 సిటీల్లోని మిలటరీ స్థావరాలు లక్ష్యంగా మిసైల్స్, డ్రోన్లతో దాడులకు ప్రయత్నాలు చేసిందని చెప్పింది. అయితే ఆ దాడులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ద్వారా విజయవంతంగా అడ్డుకున్నామని వెల్లడించింది. ‘సుదర్శన చక్రం’ ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్లను నేలకూల్చామని తెలిపింది. జమ్మూకాశ్మీర్లోని అవంతిపురా, శ్రీనగర్, జమ్మూ, పంజాబ్లోని పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భఠిండా, రాజస్థాన్లోని నాల్, ఫలోదీ, ఉత్తర్లాయ్, గుజరాత్లోని భుజ్, చండీగఢ్పై దాడులకు పాక్ యత్నించిందని పేర్కొంది. తమ దేశంలోని మిలటరీ స్థావరాలపై దాడి చేస్తే, అందుకు ప్రతిదాడి తప్పదని పాక్ను భారత రక్షణ శాఖ హెచ్చరించింది.