పాక్లో వరదల బీభత్సం

పాక్లో వరదల బీభత్సం

భారీ వరదలతో పాకిస్థాన్  అల్లాడిపోతోంది. సగానికి పైగా పాక్  భూభాగం వరద ప్రభావితమైంది. జులై నుంచి పాక్ లో అసాధారణ రుతుపవన ప్రభావం కారణంగా పరిస్థితి నెలకొంది. సింధ్ , బలోచిస్థాన్ , ఖైబర్  పక్తుంఖ్వాలో తీవ్ర ప్రభావం ఉంది. ఇప్పటి వరకు పాక్ లోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చినట్లు తెలిపింది పాక్  నేషనల్  డిజాస్టర్  మేనేజ్ మెంట్  అథారిటీ.

బలోచిస్థాన్ లో 5 రెట్లు అధిక వర్షం
వరదల్లో ఇప్పటి వరకు 1061 మంది చనిపోగా.. 4 లక్షల 52 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తం 2 లక్షల 18 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. దాదాపు 8 లక్షల పశువులు చనిపోగా.. దాదాపు 20 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పాక్ లోని ఖైబర్  పక్తుంఖ్వాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనూర్ వ్యాలీలో ఆకస్మిక వరదలు అక్కడ 10 వంతెనలను కూల్చేశాయి. ఫలితంగా ఆహారం, మెడిసిన్ సప్లై కష్టంగా మారిపోయింది. బలోచిస్థాన్ లో 5 రెట్లు అధికంగా వర్షం పడింది. ఇప్పటికే పాక్ వ్యాప్తంగా 354.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతమైన 113 కంటే మూడు రెట్లు అధికం. భవిష్యత్తులో మరిన్ని వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అంచనా వేస్తుంది పాక్  వాతావరణ శాఖ. మరోవైపు పాక్ వరదల వల్ల చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు ప్రధాని మోడీ. వరదల నుంచి పాక్ ప్రజలు కోలుకోవాలని ఆకాంక్షించారు.