
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రి ముఫ్తీ అబ్దుల్ షకూర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. శనివారం ఆయన తన కారులో ఇస్లామాబాద్లోని సెక్రటరీ చౌక్ కు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఆయన వెహికల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. యాక్సిడెంట్ జరిగినపుడు కారులో మంత్రి ఒక్కరే ఉన్నారని ఇస్లామాబాద్ ఐజీ అక్బర్ నజీర్ ఖాన్ మీడియాకు తెలిపారు. మంత్రి మృతి వార్త తెలిసి ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్ర్భాంతికి గురయ్యారు.
మరో ప్రమాదంలో ఆరుగురు పోలీసులు..
క్వెట్టా–కరాచీ నేషనల్ హైవేపై ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో వారు శిక్షణ ముగించుకొని రంజాన్ సెలవుల కోసం వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న ట్రక్కు వారి వెహికల్ను ఢీకొట్టింది. శనివారం ఈ దుర్ఘటన
జరిగిందని అధికారులు తెలిపారు.