ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్కు స్పెషల్ స్టేటస్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పొగుడుతూ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఇండియా అనుకూల బ్యానర్లు వెలిశాయి. దీన్ని గుర్తించిన అధికారులు వాటిని తొలగించి…ఈ సంఘటనతో సంబంధమున్న ఒకర్ని అరెస్టుచేశారు. ఇండియాతోపాటు పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్లతో కూడిన అఖండ భారత్ మ్యాప్ కూడా ఈబ్యానర్లో ఉంచారు. ‘‘ ఈరోజు మేం జమ్మూకశ్మీర్ను తీసుకున్నాం. రేపు బలూచిస్తాన్, పాక్ ఆక్రమించుకున్న కశ్మీర్నూ స్వాధీనం చేసుకుంటాం. అఖండభారతం కలను ప్రధాని నరేంద్రమోడీ సాకారం చేస్తారన్న నమ్మకం నాకుంది’’ అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మెస్సేజ్ను కూడా బ్యానర్పై రాశారు.
ఇస్లామాబాద్లోని ప్రెస్ క్లబ్, సెక్టర్-16, అబ్పరా చౌక్ దగ్గర కట్టిన ఈబ్యానర్లు చాలా గంటలపాటు అలాగే ఉన్నాయి. ఆ దారిన వెళ్తున్న ఒకరు వీటిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు ఆ బ్యానర్లు తొలగించారని డాన్ పేపర్ రాసింది. ఈ ఘటనపై ఇస్లామాబాద్ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఐదు గంటల వరకు అధికారులు ఎందుకు వాటిని పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులు మోటర్ సైకిల్పై వచ్చి వీటిని కట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు డాన్ పేపర్ చెప్పింది. దీంతో సంబంధమున్న ఒకర్ని బ్లూ ఏరియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మానస సరోవర్ యాత్రకు వీసాలివ్వడంలో చైనా ఆలస్యం
న్యూఢిల్లీ: 370 ఆర్టికల్ రద్దుచేసిన వెంటనే మనదేశంపై చైనా తన అక్కసుని బయటపెట్టింది. బుధవారం కైలాస మానస సరోవర్ యాత్రకు రెడీ అయిన మనదేశస్తులకు చైనా వీసా ఇవ్వలేదు. రెండు ఇండియన్ టీమ్లకు మంగళవారం నాటికే వీసాలు ఇష్యూ చేయాల్సి ఉంది. యాత్రకు వెళ్లే ముందు రోజు ఉదయమే టూరిస్టులకు చైనా వీసా ఇస్తుంది. ఈసారి మాత్రం అలా జరక్కపోవడంతో సొంత ఊళ్ల నుంచి బయల్దేరిన యాత్రికులు ఢిల్లీలోనే ఆగిపోయారు. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంతో వారు అక్కడే ఉండిపోయారు. జమ్మూకాశ్మీర్ను విభజిస్తూ.. లఢక్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంపై చైనా అభ్యంతరం చెప్పింది. ఇది పూర్తిగా ఇంటర్నల్ వ్యవహారమని , దీంట్లో జోక్యం చేసుకోవద్దని మనదేశం చైనాకు గట్టిగానే సమాధానం చెప్పింది.