
లష్కరే టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చిన స్థానికుల అరెస్ట్
ఉగ్రవాదుల వివరాలు వెల్లడించిన నిందితులు
టెర్రరిస్టులని తెలిసి కూడా షెల్టర్ ఇచ్చారు: ఎన్ఐఏ
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్ కేసులో ముందడుగు పడింది. ఈ దాడి వెనుక ఉన్నది పాకిస్తానే అని తేలిపోయింది. టూరిస్టులను కాల్చి చంపిన టెర్రరిస్టులు లష్కరే తాయిబా (ఎల్ఈటీ) సంస్థకు చెందిన వారుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గుర్తించారు. 26 మంది టూరిస్టులను చంపిన టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఆ ఇద్దరు నిందితులను పహల్గాంకు చెందిన పర్వేజ్ అహ్మద్ జోథార్, బషీర్ అహ్మద్ జోథార్గా గుర్తించారు. ముగ్గురు టెర్రరిస్టులకు వారు ఆశ్రయం ఇవ్వడంతో పాటు రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేశారు.
అధికారుల విచారణలో టెర్రరిస్టుల వివరాలను వారు వెల్లడించారు. ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తాయిబా (ఎల్ఈటీ) టెర్రర్ సంస్థకు చెందిన వారని తెలిపారు. ‘‘టెర్రరిస్టులు అని తెలిసి కూడా పర్వేజ్, బషీర్ వారికి ఆశ్రయం కల్పించారు. ఓ కొండ ప్రాంతంలో వారికి ఏర్పాట్లు చేశారు. ఆహారం, షెల్టర్ ఇవ్వడంతో పాటు ముష్కరులకు రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత టెర్రరిస్టులు పహల్గాంలో 26 మంది టూరిస్టులను చంపారు” అని ఎన్ఐఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 కింద పర్వేజ్, బషీర్ ను అరెస్టు చేశామని చెప్పారు. వారి అరెస్టుతో ఈ కేసు దర్యాప్తులో కీలక అడుగు ముందుకు పడినట్లయిందని వెల్లడించారు. కాగా.. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ వ్యాలీలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత ఆర్మీ.. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. వంద మందిపైనే ముష్కరులు కూడా ఈ ఆపరేషన్లో హతమయ్యారు.