న్యూఢిల్లీ: భారత్ రూపొందించిన కరోనా టీకాలను దాయాది పాకిస్థాన్ త్వరలో అందుకోనుందని సమాచారం. యునైటెడ్ గ్లోబల్ అలయెన్స్ ప్రకారం పేద దేశాల్లో ఇమ్యూనైజేషన్ను పెంచడంలో భాగంగా మేడిన్ ఇండియా వ్యాక్సిన్లను పాక్కు పంపుతున్నారు. ఈ టీకాలు త్వరలో పాక్కు చేరుకోనున్నట్లు తెలిసింది.
భారత్ ఇప్పటికే 65 దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేసింది. అయితే పొరుగు కంట్రీల్లో పాక్ తప్ప అన్ని దేశాలకు ఇండియా టీకాను పంపింది. అఫ్గానిస్థాన్, మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలు భారత టీకాలను పొందాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 190 దేశాల్లోని 20 శాతం జనాభాకు కరోనా టీకాను ఉచితంగా అందించాలని యునైటెడ్ గావి అలయెన్స్ తీర్మానం చేసింది. ఈ కంట్రీస్ లిస్ట్లో పాకిస్థాన్ కూడా ఉంది. అందుకే తాజాగా పాక్కు వ్యాక్సిన్లు పంపేందుకు భారత్ అంగీకరించిందని సమాచారం. 45 మిలియన్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను పాక్కు పంపనున్నట్లు తెలుస్తోంది.