ఇస్లామాబాద్ : టెర్రర్ సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తాలిబాన్ సర్కారుకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ లేఖ రాసింది. అతడు అఫ్గాన్లోనే ఉన్నాడని ఆ లెటర్లో పాక్ పేర్కొంది. పాకిస్తాన్ నుంచి ఇతర దేశాల్లో టెర్రర్ కార్యకలాపాలు నిర్వహించేందుకు పాక్ కు మసూద్ నిధులు సమకూరుస్తున్నాడని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తనపై ఒత్తిడి తేవడం వల్లే పాకిస్తాన్ ఈ లెటర్ రాసినట్లు తెలుస్తున్నది. టెర్రర్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటే పాక్ను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని కూడా ఎఫ్ఏటీఎఫ్ సూచించినట్లు సమాచారం. మసూద్ అఫ్గాన్లోని నన్గర్హార్, కన్హార్ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకుంటున్నాడని పాక్ మీడియా సంస్థ బోల్ న్యూస్ పేర్కొంది. అలాగే 26/11 ముంబై టెర్రర్ అటాక్ ప్లానర్, లష్కరే తాయిబా కమాండర్ సాజిద్ మిర్ను ఎఫ్ఏటీఎఫ్ ఒత్తిడి వల్లే పాక్ దోషిగా తేల్చింది. కాగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింరాజ్య స్థాపన కోసం జిహాద్ చేయాలని జైషే క్యాడర్ ను మసూద్ రెచ్చగొడుతూ పాకిస్తానీ సోషల్ మీడియా నెట్ వర్క్స్ లో ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నాడు. 2019 మే 1న అతడిని అంతర్జాతీయ టెర్రరిస్టుగా యూఎన్ ప్రకటించింది.
పాక్కు తాలిబాన్ కౌంటర్
కాబూల్ : జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ తమ దేశంలో లేడని తాలిబాన్లు తేల్చిచెప్పారు. ఎలాంటి ఆధారాల్లేకుండా అఫ్గానిస్తాన్లో జైషే చీఫ్ తలదాచుకున్నాడని ఆరోపించడమేంటని పాకిస్తాన్పై మండిపడ్డారు. అఫ్గాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈమేరకు కామెంట్ చేశారని టోలో న్యూస్పేర్కొంది. మసూద్ అజహర్ అఫ్గాన్లోనే తలదాచుకున్నాడని, వెతికి పట్టుకుని అరెస్టు చేయాలని పాక్ ప్రభుత్వం అఫ్గాన్ విదేశాంగ శాఖకు లెటర్ రాసింది. పాక్ విదేశాంగ శాఖ ఉన్నతాధికారిని కోట్ చేస్తూ ఆ దేశ మీడియా కథనాలు వెలువరించింది. ఈ వార్తలను జబీహుల్లా తీవ్రంగా ఖండించారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడంవల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని పాకిస్తాన్ను హెచ్చరించారు. ఇండియా సహా పలు దేశాల ప్రభుత్వాలు వెతుకుతున్న అంతర్జాతీయ టెర్రరిస్టుకు తాము ఆశ్రయం కల్పించలేదని తేల్చిచెప్పారు. ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అఫ్గాన్ ప్రభుత్వం ఒప్పుకోదని స్పష్టంచేశారు. నిజానికి పాక్నుంచే పలు టెర్రరిస్టు సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని జబీహుల్లా పేర్కొన్నారు.